మేం కానీ తలచుకుంటేనా..?: చంద్రబాబును హెచ్చరించిన సోము వీర్రాజు

  • మోదీ సభ అడ్డుకోవాలని చూస్తారా?
  • మేం తలచుకుంటే ధర్మ పోరాట సభలు జరిగేవి కావు
  • మోదీ కడిగిన ముత్యం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ నేతలు అంటున్నారని, తాము తలచుకుంటే టీడీపీ ధర్మ పోరాట సభలను అడ్డుకోగలమని అన్నారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో శివసేనకు పట్టిన గతే ఏపీలో టీడీపీకి పడుతుందని హెచ్చరించారు. చంద్రబాబుది అధర్మ పోరాటమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నిధుల గురించి లెక్కలు చెప్పమంటే కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తూ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కూర్చున్నారని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోదీ కడిగిన ముత్యం లాంటి వారని సోము వీర్రాజు ప్రశంసించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ప్రధాని మోదీకి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందన్నారు. రాఫెల్ డీల్ విషయంలో కాంగ్రెస్ ఎంత గగ్గోలు పెట్టినా ఫలితం లేకుండా పోయిందన్నారు. దీంతో ఏం చేయాలో తెలియక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారని విమర్శించారు.
Go Back to Shorts
BJP
Narendra Modi
Somu veerraju
Telugudesam
Andhra Pradesh

More Telugu News