ప్రధాని గారూ.. బుల్లెట్ రైలును మర్చిపోండి.. ఉన్నవాటిపై దృష్టి పెట్టండి: బీజేపీ నేత

  • మోదీ చెబుతున్న ‘అచ్చేదిన్’ ఎక్కడ?
  • రైలులో ఏ ఒక్కటీ బాగాలేదు
  • హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేస్తే స్పందన కరవు
బుల్లెట్ రైలు విషయాన్ని పక్కనపెట్టి ఉన్న రైళ్ల సంగతి చూడాలని బీజేపీ సీనియర్ నేత, పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీకాంత చావ్లా ప్రధాని నరేంద్రమోదీ, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లకు సూచించారు. సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలులో అమృత్‌సర్ నుంచి అయోధ్య ప్రయాణించిన ఆమె అనంతరం మాట్లాడుతూ ఓ వీడియోను విడుదల చేశారు. రైలులో ‘‘అచ్చే దిన్’’ ఎక్కడున్నాయని ప్రశ్నించిన చావ్లా.. సరయు-యమున ఎక్స్‌ప్రెస్ రైలు డోర్లు బాగాలేవని, బాత్రూములో నల్లాలు పనిచేయడం లేదని, టాయిలెట్ సీట్లు పగిలిపోయాయని పేర్కొన్నారు. తాను ఎక్కిన రైలు తొమ్మిది గంటలు ఆలస్యంగా నడిచినట్టు పేర్కొన్నారు.  

ఏసీ 3 టయర్ కోచ్‌లో ప్రయాణించిన చావ్లా..  రైలులో నీళ్లు లేవని, ఆహార సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైలు అన్ని గంటలు ఎందుకు ఆలస్యమైందో తెలుసుకుందామని ప్రయత్నిస్తే ఒక్కరు కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైలును దారి మళ్లించినట్టు ఆ తర్వాత తనకు తెలిసిందన్నారు. రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదని, రైల్వే మంత్రికి ఈమెయిల్స్ పంపినా స్పందన లేకుండా పోయిందని అన్నారు. రైల్వే వ్యవస్థ మొత్తం తప్పుడు సమాచారంతో నడుస్తోందని దుమ్మెత్తి పోశారు.
Go Back to Shorts
Amritsar
Ayodhya
BJP
achhe din
railways
Laxmi Kanta Chawla

More Telugu News