Na Muthuswamy: నట శిక్షణ కేంద్రం 'కూత్తుపట్టరై' వ్యవస్థాపకుడు ముత్తుస్వామి కన్నుమూత
తమిళ నటులు విజయ్ సేతుపతి, విమల్, విదార్థ్లతోపాటు మరెందరినో తీర్చిదిద్దిన ‘కూత్తుపట్టరై’ వ్యవస్థాపకుడు ముత్తుస్వామి (82) అనారోగ్యంతో మృతి చెందారు. తంజావూరు జిల్లా పుంజై గ్రామానికి చెందిన ముత్తుస్వామి 'కూత్తుపట్టరై' పేరిట నట శిక్షణ కేంద్రాన్ని స్థాపించి సినీ పరిశ్రమకు కొత్త ముఖాలను పరిచయం చేశారు. తొలుత వీధినాటకాల్లో శిక్షణ ఇచ్చిన ఆయన ఆ తర్వాత చెన్నైలో శిక్షణ ఇచ్చారు. తమిళ చిత్ర పరిశ్రమలోని పలువురు సినీ కళాకారులను తీర్చిదిద్దింది ఇక్కడే. అంకితభావానికి మారుపేరైన ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన మృతికి కోలీవుడ్ సంతాపం తెలిపింది.