పవన్ 'హత్య' వ్యాఖ్యలతో కలకలం... ఆ ముగ్గురూ ఎవరని చర్చ!

  • తన హత్యకు కుట్ర పన్నారన్న పవన్
  • వైసీపీ వాళ్లే చేస్తున్నారంటున్న టీడీపీ నేతలు
  • కాపుల ఓట్లను చీల్చుతారని టీడీపీ కుట్ర పన్నిందన్న వైసీపీ
  • కాల్ రికార్డుంటే బయట పెట్టాలని సూచనలు
"నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోగా పవన్ ను చంపేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు" అని నిన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర కలకలం రేపాయి. తన హత్యకు కుట్రపై ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకుంటున్న కాల్ రికార్డును తాను విన్నానని, మొత్తం ముగ్గురు కుట్ర పన్నారని, వారు ఎవరో తనకు తెలుసునని, అయినా ప్రస్తుతానికి వారి పేర్లను బయట పెట్టనని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దీంతో ఆ ముగ్గురూ ఎవరన్న కొత్త చర్చ మొదలైంది. అసలు పవన్ ను హత్య చేయాలని ఎవరు కుట్ర పన్నుతారు? ఆయన మరణిస్తే లాభం ఎవరికి? అన్న కోణంలో రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. ఇక పవన్ హత్యకు కుట్ర చేస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలేనని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తుంటే, కాపుల ఓట్లను పవన్ చీల్చుతారన్న కారణంతో టీడీపీ నేతలే కుట్ర చేస్తుండవచ్చని వైకాపా నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు.

ఇక పవన్ వద్ద కాల్ రికార్డు ఉంటే, నేరుగా దాన్ని పోలీసులకు ఎందుకు అప్పగించలేదని, వారిపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్న వారు కూడా ఉన్నారు. హత్యకు కుట్ర చేసిన వారి వివరాలను బహిర్గతం చేయకుండా, కేవలం ఆరోపణలు చేయడం వెనుక, రాజకీయ ప్రయోజనాలను ఆయన ఆశిస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి.
Go Back to Shorts
Pawan Kalyan
Murder
Plan
Telugudesam
Jana Sena
YSRCP

More Telugu News