jagan: అక్రమాలకు అడ్డు వస్తున్నాయని... రాత్రికి రాత్రి విగ్రహాలను కూడా తరలించారు: జగన్

షార్ట్స్‌లో చూడండి
గుడిని, గుడిలోని లింగాన్ని కూడా మింగేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు దక్కుతుందని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. టీడీపీ పాలనలో దేవాలయాలకు కూడా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తన పాదయాత్రలో భాగంగా నేడు ఆయన గన్నవరంలోని బ్రహ్మలింగయ్య చెరువును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నీరు-చెట్టు పథకం కింద ఇసుక, మట్టిని టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా, ఫలితం లేదని అన్నారు. ఈ అవినీతి సొమ్ము కింది స్థాయి నుంచి నారా లోకేష్, చంద్రబాబు వరకు కమిషన్ల రూపంలో వెళుతోందని దుయ్యబట్టారు.

మట్టి తవ్వేందుకు దేవాలయం అడ్డు వస్తోందనే కారణంతో... అందులో ఉన్న విగ్రహాలను కూడా రాత్రికి రాత్రి తరలించారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి చెరువు పరిస్థితి ఇలాగే ఉందని అన్నారు. మట్టితో వ్యాపారం ఎలా చేయాలో చంద్రబాబుకు తెలుసని విమర్శించారు. చివరకు సీఎం కార్యాలయానికి 35 కిలోమీటర్ల దూరంలో కూడా ఇసుక వ్యాపారం జరుగుతోందని అన్నారు. 
Go Back to Shorts
jagan
Chandrababu
Nara Lokesh

More Telugu News