ముగ్గురు ఆకతాయిలను మట్టికరిపించి, పోలీసులకు అప్పగించిన యువతి

  • ముగ్గురు ఆకతాయిల ఆటకట్టించిన యువతి
  • ఇంటి నుంచి దుకాణానికి వెళ్తుండగా వేధింపులు
  • ఆమెను స్పూర్తిగా తీసుకుని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచన
వేధింపులకు దిగిన ముగ్గురు ఆకతాయిలను ఓ యువతి ఒంటరిగా ఎదిరించి చితక్కొట్టి, పోలీసులకు అప్పగించిన ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే... పశ్చిమ బెంగాల్ లోని బిర్‌ భూమ్‌ జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు దగ్గర్లోని దుకాణానికి వెళ్లింది.

ఈ క్రమంలో ముగ్గురు ఆకతాయిలు ఆమెను అడ్డుకుని వేధింపులకు దిగారు. వారిలో ఒకడు ఇంకాస్త ముందుకు వెళ్లి ఆమె చేతిని పట్టుకుని, అసభ్యకరంగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. దీంతో వారిని వారించి, హెచ్చరించిన యువతి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసింది. వారు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ముగ్గుర్నీ చితకబాదింది.

ఇంతలో ఏదో గొడవ జరుగుతోందని తెలియడంతో స్థానికుడైన అనిర్ బర్ సేన్ అక్కడకు వెళ్లగా, ఆ ముగ్గురి దుమ్ముదులుపుతున్న యువతి కనిపించింది. ఆమె తెగువను చూసిన అనిర్ బర్... యువతులు ఆమెను స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. అనంతరం ఆమె వారిని పోలీసులకు పట్టించింది. దీంతో స్థానికులు, పోలీసులు ఆమె ధైర్య సాహసాలను అభినందిస్తున్నారు.
Go Back to Shorts
West Bengal
birbhoom
girl harassed

More Telugu News