hyderabad metro rail: మెట్రో స్టేషన్లు, రైళ్లలో ప్రయాణికులు చేయకూడని పనులు ఇవే.. కాదని చేస్తే, కఠిన శిక్షలే!

  • 28 నుంచి పరుగులు పెట్టనున్న హైదరాబాద్ మెట్రో రైళ్లు
  • ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం
  • ప్రయాణికులపై పలు ఆంక్షలు 

ఈ నెల 28వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా హైదరాబాద్ మెట్రో రైలు సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి, మెట్రో రైలును ప్రారంభించనున్నారు. అనంతరం మియాపూర్ నుంచి అమీర్ పేట వరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలసి మెట్రో రైల్లో ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. మరోవైపు, మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు అధికారులు పలు షరతులు విధించారు. మెట్రో స్టేషన్ లో కానీ, రైల్లో కానీ ఏయే పనులు చేయకూడదో ఓ జాబితా విడుదల చేశారు. అవేంటో చూద్దాం...

  • రైల్లోకి ప్రవేశించిన తర్వాత ఫొటోలు తీయరాదు 
  • రైళ్లలో ఆహారం, తినుబండారాలు తీసుకోకూడదు
  • పెంపుడు జంతువులను తీసుకెళ్లకూడదు
  • ఎస్కలేటర్లపై కూర్చోవడం, వాలడం... వాటి కదలికను ఆపడం చేయరాదు
  • స్టేషన్ పరిసరాల్లోని నిషిద్ధ ప్రాంతాల్లో కూర్చోరాదు
  • రైలు కోసం వేచి ఉన్నప్పుడు పసుపురంగు లైన్ దాటరాదు
  • రైలు ప్రయాణిస్తున్నప్పుడు బలవంతంగా డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయరాదు
  • డోర్లకు ఆనుకుని నిల్చోరాదు
  • రైలు కోసం ప్లాట్ ఫామ్ పై పరుగెత్తరాదు
  • స్టేషన్ పరిసరాలు, బోగీల్లో ఉమ్మి వేయడం, ధూమపానం చేయడం, పాన్ నమలడం చేయరాదు. ఆల్కహాల్ సేవించరాదు.
  • చిన్నారులను స్టేషన్ పరిసరాల్లో, ప్లాట్ ఫామ్ పై వదిలేయరాదు
  • మెట్రో స్టేషన్ పరిసరాల్లో వీధి వ్యాపారాలు నిషేధం
  • బోగీలకు నోటీసులు అంటించరాదు
  • ఎవరైనా సరే తమ స్మార్ట్ కార్డును లేదా టోకెన్ ను ఇతర ప్రయాణికులతో పంచుకోరాదు
  • బోగీ డోర్లు తెరుచుకునే లేదా మూసుకునే సమయంలో వాటి మధ్య నిల్చోరాదు
  • అత్యవసర కమ్యూనికేషన్ సాధనాలతో డ్రైవర్ తో సంభాషించరాదు. వైద్యపరమైన అవసరం ఏర్పడినప్పుడు మాత్రమే వారితో సంభాషించాలి.
  • పై షరతులు, నిబంధనలకు కాదని ప్రవర్తిస్తే... కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

More Telugu News