చిరంజీవి, అల్లు అరవింద్ లకు లేని బాధ వీళ్లకెందుకు?: 'నంది' విమర్శకులకు జీవిత ఘాటు జవాబు
- లైవ్ షోలలో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు
- ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు
- చిరంజీవి, అల్లు అరవింద్ లకు లేని బాధ పక్కవాళ్లకెందుకు?
ఈ అవార్డుల గురించి జనాలు మాట్లాడుకోవడం లేదని... సినీ పరిశ్రమకు చెందిన వారే టీవీ లైవ్ షోలలో కూర్చుని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారంటూ జీవిత మండిపడ్డారు. వీరి వ్యవహారం తనను ఎంతో బాధించిందని చెప్పారు. 'రుద్రమదేవి' సినిమా గురించి మాట్లాడుతూ, ఈ కేటగిరీలో కూడా తీవ్రమైన పోటీ ఉందని, అన్ని కోణాల్లో పరిశీలించి ఉత్తమ చిత్రాన్నే ఎంపిక చేశామని తెలిపారు. బాగా తీసిన సినిమాను బాగోలేదు అని చెప్పడం తమకేమైనా సరదానా? అని అన్నారు.
జ్యూరీ ప్రాసెస్ ఎలా జరిగిందో తెలుసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అర్హత ఎవరికీ లేదని చెప్పారు. సపోర్టింగ్ క్యారెక్టర్ కోసం అల్లు అర్జున్ పేరును ఎంట్రీకి పంపి ఉండవచ్చని... అయినా, అది మంచి పాత్ర కావడంతో ఎస్వీ రంగారావు పేరుతో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డుని ఇచ్చామని తెలిపారు. దీన్ని తాము ఒక గొప్ప విషయంగా భావిస్తున్నామని చెప్పారు. ఈ విషయం గురించి చిరంజీవి, అల్లు అరవింద్, అల్లు అర్జున్ ఎవరూ మాట్లాడలేదని... బయటివాళ్లు మాత్రమే మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.