జీవితాంతం అయోధ్య రామాలయం కోసం పరితపించిన మహంత్ భాస్కర్ దాస్ అస్తమయం!

  • గుండెపోటుతో మృతి
  • రామాలయం కోసం దశాబ్దాలుగా కృషి చేస్తున్న భాస్కర్ దాస్
  • ఆయన వయసు 88 సంవత్సరాలు
  • 1949 నుంచి బాబ్రీ కేసులో భాగస్వామ్యం
  • సంతాపం వెలిబుచ్చిన పలువురు నేతలు
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం జీవితాంతమూ పరితపించిన నిర్మోహీ అఖడా చీఫ్ మహంత్ భాస్కర్ దాస్ ఈ ఉదయం అస్తమించారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. అయోధ్యలోని వివాదాస్పద స్థలం తమదేనని దశాబ్దాలుగా వాదిస్తున్న మూడు సంస్థల్లో నిర్మోహీ అఖడా ఒకటి. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భాస్కర్ దాస్ కు గుండెపోటు వచ్చిందని, ఆ వెంటనే హర్షన్ హృదయ సంస్థాన్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స చేశారని, అయినా ఫలితం కనిపించలేదని నిర్మోహి అఖడా ప్రకటించింది.

కాగా, 2003, 2007 సంవత్సరాల్లో ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. అప్పట్లో తప్పించుకున్న ఆయన ఈ దఫా మాత్రం మృత్యు కౌగిలి నుంచి బయటపడలేక పోయారు. 1929లో గోరఖ్ పూర్ లో పుట్టిన ఆయన, 1946లో అయోధ్యకు వచ్చారు. 1949 నుంచి రామ జన్మభూమి - బాబ్రీ మసీదు కేసులో భాగస్వామ్యమై, రామాలయం నిర్మాణమే తన జీవితాశయం అన్నట్టు శ్రమించారు. ఆయన మృతిపై వీహెచ్ పీ, బీజేపీ తదితర పార్టీల నేతలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.
Go Back to Shorts
ayodhya
ram janmabhoomi
nirmohi akhada
bhaskar das

More Telugu News