100 అడుగుల లోయలోకి బస్సు.. ఏడుగురి మృతి

Himachal Pradesh bus accident in Chamba district kills seven people
  • హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఘటన
  • మరో 11 మందికి తీవ్ర గాయాలు
  • మృతుల్లో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌
  • ప్రమాద సమయంలో బస్సులో 20-25 మంది
  • మలుపు వద్ద అదుపుతప్పడంతో ప్రమాదమని ప్రాథమిక సమాచారం
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంబా జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

శర్మ ట్రావెలర్స్‌కు చెందిన బస్సు శనివారం ఉదయం సుమారు 6.30 గంటలకు బైరాగఢ్‌ నుంచి చంబా పట్టణానికి బయలుదేరింది. దాదాపు మూడు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత చాలుజ్‌ మలుపు వద్ద ప్రమాదం జరిగింది. మలుపు తిప్పుతున్న సమయంలో డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి జారి లోయలో పడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద స్థలానికి దిగువన ఉన్న మరో రోడ్డుపై బస్సు పడిపోయింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది.

నుజ్జునుజ్జయిన బస్సులో చిక్కుకున్న బాధితులను బయటకు తీసేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడిన 11 మందిని తిస్సా పట్టణంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదని చంబా జిల్లా ఎస్పీ విజయ్‌ సక్లానీ తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 20 నుంచి 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
Advertisement
Himachal Pradesh Bus Accident
Chamba District
Sharma Travelers
Road Accident News
Himachal Pradesh News
Bus Plunges Into Gorge

More Telugu News