శబరిమల కానుకల లెక్కింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

Kerala High Court issues key orders on counting Sabarimala offerings
  • స్ట్రాంగ్ రూమ్ లో 80 బస్తాలలో భద్రపరిచి ఉన్న కానుకలు
  • కానుకల లెక్కింపు ప్రక్రియకు పూర్తి సహకారం అందించాలని బోర్డుకు కోర్టు ఆదేశం
  • కానుకలను భద్రపరిచే శాశ్వత విధానాన్ని తమకు తెలియజేయాలన్న కోర్టు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల మదింపు, భద్రతకు సంబంధించి కేరళ హైకోర్టు తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డుకు కీలక ఆదేశాలు జారీ చేసింది. 80 బస్తాలలో భద్రపరిచిన అయ్యప్పస్వామి బంగారు, వెండి కానుకల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షిస్తున్న మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేటీ శంకరన్‌కు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని బోర్డును కోర్టు ఆదేశించింది.


ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తూ జస్టిస్ వి. రాజా విజయ రాఘవన్ ఈ ఉత్తర్వులు ఇచ్చారు. జూలై 4న నిర్వహించిన తనిఖీల్లో ఆ 80 సంచులలో కేవలం బంగారం, వెండి మాత్రమే కాకుండా ఇతర సామగ్రి కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో, విలువ లేని వస్తువులను ముందుగా వేరు చేస్తే తప్ప అసలైన కానుకల విలువను నిర్ధారించడం సాధ్యం కాదని నివేదిక పేర్కొంది. ఈ వేరుచేసే ప్రక్రియకు, మదింపునకు పూర్తి సహకారం అందిస్తామని దేవస్థానం బోర్డు కోర్టుకు హామీ ఇచ్చింది.


భవిష్యత్తులో స్వీకరించే విలువైన కానుకలను సురక్షితంగా భద్రపరచడానికి అనుసరించబోయే శాశ్వత విధానాన్ని తమకు తెలియజేయాలని బోర్డు స్టాండింగ్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఆలయానికి వచ్చే కానుకలను క్రమానుగతంగా మదింపు చేసి, ఒక సమగ్రమైన డిజిటల్ ఇన్వెంటరీ ద్వారా నమోదు చేయడమే దీని ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేసింది.


శబరిమల ఆలయ తిరువాభరణం రిజిస్టర్ లోని వస్తువులతో పాటు స్ట్రాంగ్ రూమ్‌లోని విలువైన వస్తువుల సమగ్ర మదింపు కోసం జస్టిస్ కేటీ శంకరన్‌ను కోర్టు గతంలోనే నియమించింది. ఈ డిజిటల్ పద్ధతి ద్వారా భక్తుల కానుకల నమోదులో పారదర్శకత, భద్రత మరింత పెరుగుతుందని కోర్టు ఆశాభావం వ్యక్తం చేసింది. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.

Advertisement
Kerala High Court
Sabarimala Temple
Travancore Devaswom Board
Sabarimala Gold Offerings
Justice KT Sankaran
Digital Inventory

More Telugu News