ఈ20 పెట్రోల్‌తో మైలేజ్‌ 3-5% తగ్గొచ్చు.. కానీ లాభాలు ఎన్నో: కేంద్రం

  • అధిక ఆక్టేన్‌, మెరుగైన పికప్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరణ
  • ఈ20 అమలుకు ముందు ఆటో కంపెనీలతో సంప్రదింపులు జరిపామని వెల్లడి
  • ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందన్న ఆధారాలు లేవన్న కేంద్రం
  • ఈ20తో కార్బన్‌ ఉద్గారాలు సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని వెల్లడి
ఈ20 (20 శాతం ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌) వినియోగంతో కొన్ని వాహనాల్లో మైలేజ్‌ 3-5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే మైలేజ్‌ను మాత్రమే ప్రమాణంగా చూడకూడదని, ఈ20 వల్ల అనేక కీలక ప్రయోజనాలు లభిస్తాయని స్పష్టం చేసింది.

ఈ20 పెట్రోల్‌కు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే అధిక ఆక్టేన్‌ రేటింగ్‌, మెరుగైన యాంటీ-నాక్‌ లక్షణాలు ఉంటాయని పేర్కొంది. దీంతో ఇంజిన్‌ పనితీరు మెరుగుపడటంతో పాటు వాహనానికి మంచి పికప్‌, సాఫీ యాక్సిలరేషన్‌, శుభ్రమైన ఇంజిన్‌ నిర్వహణ వంటి ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించింది.

ఈ20 అమలుకు ముందే ఆటోమొబైల్‌ తయారీ సంస్థలు, విడిభాగాల తయారీదారులు, పరిశోధనా సంస్థలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంజిన్‌ పనితీరు, ఇంధన వ్యవస్థ, మన్నిక, ఉద్గారాలు, ఇంధన సామర్థ్యం వంటి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఈ20 అమలు చేపట్టినట్లు పేర్కొంది.

వాహన తయారీ సంస్థలు పూర్తిగా సంతృప్తి చెందకపోతే ఈ20కు మద్దతు ఇచ్చేవి కాదని, వాహనాల వారంటీలను కూడా కొనసాగించేవి కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు పాత, కొత్త వాహనాలకు వారంటీ ఇస్తుండటమే దీనికి నిదర్శనమని పేర్కొంది.

2025-26 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకీ 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్‌ చేయగా, అందులో 1.5 కోట్ల పాత ఈ20 సర్టిఫికేషన్‌ లేని వాహనాలు కూడా ఉన్నాయని తెలిపింది. అయినప్పటికీ ఈ20 కారణంగా తుప్పు పట్టడం, విడిభాగాలు దెబ్బతినడం లేదా అసాధారణ అరుగుదల వంటి సమస్యలు ఏవీ గుర్తించలేదని వెల్లడించింది. హీరో మోటోకార్ప్‌ కూడా ఇదే తరహా అనుభవాన్ని నివేదించినట్లు తెలిపింది.

అలాగే ఈ20 వాడకంతో సూక్ష్మ రేణువుల ఉద్గారాలు చాలా తక్కువగా ఉంటాయని, మొత్తం కార్బన్‌ ఉద్గారాలు సుమారు 40 శాతం వరకు తగ్గుతాయని కేంద్రం పేర్కొంది. ఇథనాల్‌ ఉత్పత్తి, నిల్వ, రవాణా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రతి ఏడాది సుమారు రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులకు రుణాలు అందిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Advertisement

More Telugu News