వినేశ్ ఫోగట్ పిటిషన్‌ను ముగించిన హైకోర్టు.. WFIకి కీలక ఆదేశాలు

Vinesh Phogat petition closed by High Court with key orders to WFI
  • ఆసియా గేమ్స్ ట్రయల్స్‌పై వినేశ్ ఫోగట్ పిటిషన్ క్లోజ్
  • ట్రయల్స్‌లో ఇప్పటికే పాల్గొనడంతో పిటిషన్ నిరర్థకమైందని వ్యాఖ్య
  • వినేశ్‌పై క్రమశిక్షణ చర్యలు రెండు వారాల్లో పూర్తి చేయాలని WFIకి ఆదేశం
  • ఆసియా గేమ్స్‌‌కు అర్హత సాధించడంలో విఫలమైన వినేశ్ ఫోగట్
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఆసియా క్రీడలు 2026 ఎంపిక ట్రయల్స్‌లో తనను అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు సోమవారం ముగించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వినేశ్ ఇప్పటికే ట్రయల్స్‌లో పాల్గొన్నందున, ఈ పిటిషన్‌పై ఇక విచారణ అవసరం లేదని, ఇది నిరర్థకమైందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా, వినేశ్ ఫోగట్‌కు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై రెండు వారాల్లోగా క్రమశిక్షణా చర్యల ప్రక్రియను పూర్తి చేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ను జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. తుది నిర్ణయం తీసుకునే ముందు వినేశ్‌కు వ్యక్తిగతంగా తన వాదనలు వినిపించే అవకాశం కల్పిస్తామని WFI కోర్టుకు హామీ ఇచ్చింది. తీసుకున్న నిర్ణయాన్ని సదరు రెజ్లర్‌కు, కోర్టుకు తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది.

క్రమశిక్షణా రాహిత్యం, యాంటీ-డోపింగ్ నిబంధనల ఉల్లంఘన వంటి ఆరోపణలతో మే 9న వినేశ్‌కు WFI షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనివల్ల ఆమె ట్రయల్స్‌కు అనర్హురాలిగా మారడంతో హైకోర్టును ఆశ్రయించారు. తొలుత సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించినప్పటికీ, డివిజన్ బెంచ్ జోక్యంతో ఆమెకు ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది.

అయితే, ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో మే 30, 31 తేదీల్లో జరిగిన ట్రయల్స్‌లో వినేశ్ ఫోగట్ ఆశించిన ఫలితం సాధించలేకపోయారు. మహిళల 53 కేజీల విభాగంలో జరిగిన సెమీఫైనల్‌లో ఆమె మీనాక్షి గోయత్ చేతిలో 4-6 తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఆసియా క్రీడలకు అర్హత సాధించే అవకాశాన్ని ఆమె కోల్పోయారు. తాజా కోర్టు ఉత్తర్వులతో ట్రయల్స్ వివాదం ముగిసినా, WFI క్రమశిక్షణా చర్యల ప్రక్రియ మాత్రం కొనసాగనుంది.                                
Advertisement
Vinesh Phogat
Delhi High Court
WFI
Asian Games 2026 trials
Wrestling Federation of India
Vinesh Phogat vs WFI

More Telugu News