ధైర్యముంటే చర్చకు రండి.. విపక్షాలకు రేవంత్ బహిరంగ సవాల్
- బీఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్
- అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పాలనపై చర్చిద్దామని పిలుపు
- తమ రెండేళ్లన్నర పాలనతో బీఆర్ఎస్, బీజేపీల పాలనను పోల్చుదామన్న సీఎం
- ప్రతిపక్షాలు స్పీకర్కు లేఖ ఇస్తే సమావేశానికి సిద్ధమని వెల్లడి
తమ ప్రభుత్వ రెండేళ్లన్నర పాలనను, బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 ఏళ్ల పాలనతో పోల్చి చూసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీల మేనిఫెస్టోలపై కూడా చర్చకు రావాలని ఆయన ప్రతిపక్షాలను ఆహ్వానించారు. చర్చకు సిద్ధమైతే స్పీకర్, మండలి ఛైర్మన్లకు ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ ఇవ్వాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు గృహవసతి కల్పిస్తోందని, సన్న బియ్యం పంపిణీ చేస్తోందని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.