ఐదు పెళ్లిళ్లు, ఒకే మోసం.. అనంతపురంలో సీరియల్ పెళ్లికూతురు అరెస్ట్
- పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తున్న యువతిని అరెస్ట్ చేసిన పోలీసులు
- ఇప్పటివరకు ఐదుగురిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుర్తింపు
- పెద్దవడుగూరుకు చెందిన బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
- విజయవాడకు చెందిన మధ్యవర్తుల సాయంతో మోసాలకు పాల్పడినట్లు వెల్లడి
- కర్ణాటక వ్యక్తితో పెళ్లయిన ఆరు రోజులకే మదనపల్లెలో పట్టివేత
విజయవాడకు చెందిన సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే మధ్యవర్తులతో కలిసి ఈమె ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి సమయంలో కట్నం లేదా ఇతర ప్రలోభాలతో కూడిన హామీలు ఇచ్చి, వివాహానంతరం కొద్ది రోజులు భర్తతో కలిసి ఉండి, ఆపై కనిపించకుండా పోవడం ఈమె పంథా అని పోలీసులు తెలిపారు.
పెద్దవడుగూరు మండలం కాసేంపల్లికి చెందిన యాపర్ల సుధీర్ రెడ్డి అనే వ్యక్తిని 2025లో ఈమె వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే ఆమె ఎవరికీ చెప్పకుండా అదృశ్యం కావడంతో, బాధితుడు పెద్దవడుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవల కర్ణాటకలోని మల్లికుప్పంకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న నిందితురాలు, పెళ్లైన ఆరు రోజులకే మదనపల్లె వైపు ప్రయాణిస్తుండగా పోలీసులకు చిక్కింది. మదనపల్లె మండలం చీకలబైలు సమీపంలో పెద్దవడుగూరు ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఒకరితో వివాహం జరిగిన విషయం మరొకరికి తెలియకుండా ఇలా ఐదుగురిని ఆమె పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.