పౌరసత్వానికి పాస్పోర్ట్ రుజువు కాదన్న కేంద్రం... శశిథరూర్ ఆగ్రహం
- ఇదొక అసంబద్ధమైన చట్టపరమైన వైరుధ్యమని వ్యాఖ్య
- పాస్పోర్ట్, ఆధార్లను పౌరసత్వానికి రుజువులుగా గుర్తించాలని డిమాండ్
- పౌరులు కాని వారికి వేరే రంగు ఆధార్ కార్డు ఇవ్వాలని సూచన
ఇటీవల 'పాస్పోర్ట్ సేవా దివస్' సందర్భంగా విదేశాంగ శాఖ ఈ వివరణ ఇచ్చింది. పాస్పోర్ట్ చట్టం-1967 ప్రకారం ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధన అని, పౌరసత్వానికి పాస్పోర్ట్ను ఎన్నడూ తిరుగులేని ప్రామాణికంగా పరిగణించలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ అంశంపై సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' ద్వారా స్పందించిన శశి థరూర్, దశాబ్దాలుగా పాస్పోర్ట్ను గుర్తింపునకు అత్యున్నత ప్రమాణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు విచారణ, ధ్రువపత్రాల పరిశీలన వంటి కఠినమైన ప్రక్రియల అనంతరం ప్రభుత్వం జారీ చేసే పాస్పోర్ట్ను, పౌరసత్వానికి రుజువు కాదనడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు. పౌరసత్వాన్ని నిర్ధారించుకున్నాకే ఇచ్చే ఈ పత్రం కాకపోతే, మరేది పౌరసత్వానికి రుజువు? అని ఆయన ప్రశ్నించారు.
ఈ గందరగోళానికి స్వస్తి పలకడానికి శశి థరూర్ ఒక పరిష్కారాన్ని సూచించారు. పాస్పోర్ట్, ఆధార్ కార్డులను భారత పౌరసత్వానికి ప్రామాణిక రుజువులుగా గుర్తిస్తూ తక్షణమే చట్టసవరణ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఆధార్ను కేవలం నివాస ధ్రువీకరణ ఆధారంగా జారీ చేస్తున్న నేపథ్యంలో, పౌరులు కానివారికి భిన్నమైన రంగులో ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. తద్వారా భారతీయ పౌరులకు సాధారణ ఆధార్ లేదా పాస్పోర్ట్ పౌరసత్వానికి స్పష్టమైన ఆధారాలుగా ఉపయోగపడతాయని వివరించారు. ఈ మార్పుల వల్ల ప్రభుత్వ కార్యకలాపాలు సులభతరమవడమే కాకుండా, సామాన్య పౌరులకు స్పష్టత లభిస్తుందని థరూర్ అభిప్రాయపడ్డారు.