తొలిసారిగా.. అమెరికా టెక్ చాలెంజ్ న్యాయనిర్ణేతగా భారతీయుడు

First time Indian as judge for US Tech Challenge
  • భారత్‌కు అరుదైన గౌరవం
  • అమెరికా రోబోటిక్స్ పోటీకి జ్యూరీలో కేరళ వాసి
  • కేరళకు చెందిన రోబోటిక్స్ నిపుణుడు బెన్సన్ థామస్ జార్జ్‌ ఘనత స
  • 'ఫస్ట్ టెక్ ఛాలెంజ్ మికియానా ప్రీమియర్ ఈవెంట్‌'లో న్యాయనిర్ణేతగా బాధ్యతలు
  • భారత్ ఎదుగుతున్న రోబోటిక్స్, స్టెమ్ సామర్థ్యానికి ఇది నిదర్శనం
గ్లోబల్ రోబోటిక్స్, స్టెమ్ (ఎస్టీఈఎమ్) రంగంలో భారత్ ప్రాధాన్యతను చాటుతూ, కేరళకు చెందిన రోబోటిక్స్ నిపుణుడు బెన్సన్ థామస్ జార్జ్ అరుదైన ఘనత సాధించారు. అమెరికాలో జరిగిన ప్రతిష్ఠాత్మక 'ఫస్ట్ టెక్ ఛాలెంజ్ (ఎఫ్‌టీసీ) మికియానా ప్రీమియర్ ఈవెంట్'కు న్యాయనిర్ణేతగా ఎంపికైన తొలి భారతీయుడిగా ఆయన చరిత్ర సృష్టించారు.

అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలోని సౌత్ బెండ్‌లో జూన్ 18 నుంచి 21 వరకు ఈ అంతర్జాతీయ పోటీ జరిగింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్-ఎస్టీఈఎమ్) విద్యను ప్రోత్సహించే గ్లోబల్ నాన్-ప్రాఫిట్ సంస్థ 'ఫస్ట్' (ఫర్ ఇన్‌స్పిరేషన్ అండ్ రికగ్నిషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ పోటీలో వివిధ దేశాలకు చెందిన 12 నుంచి 18 ఏళ్ల వయసు గల విద్యార్థులతో కూడిన 106 బృందాలు పాల్గొని తమ ఆవిష్కరణలను ప్రదర్శించాయి.

ఈ గుర్తింపుపై బెన్సన్ జార్జ్ సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని, ఇది యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన తెలిపారు. రోబోట్ డిజైన్, ప్రోగ్రామింగ్, ఆవిష్కరణ, టీమ్‌వర్క్ వంటి పలు అంశాల ఆధారంగా న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు.

పాఠశాల విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యున్నతమైన రోబోటిక్స్ పోటీలలో ఒకటిగా ఫస్ట్ టెక్ ఛాలెంజ్‌ను పరిగణిస్తారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో అడ్మిషన్లతో పాటు స్కాలర్‌షిప్‌లు కూడా లభిస్తాయి. ఈ ప్రోగ్రామ్ ద్వారా మొత్తం 80 మిలియన్ డాలర్లకు పైగా స్కాలర్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
Benson Thomas George
FIRST Tech Challenge
Robotics Competition
STEM Education
Michiana Premier Event
Indian Robotics Expert

More Telugu News