ఆర్ఎస్ ప్రవీణ్ హత్యకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది: శ్రీనివాస్ గౌడ్
- ప్రవీణ్ కుమార్ భద్రతను ప్రభుత్వం కావాలనే తగ్గించిందన్న శ్రీనివాస్ గౌడ్
- భద్రతను తగ్గించాలని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందా అని ప్రశ్న
- ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరిక
బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను హతమార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రవీణ్ కుమార్కు ఉన్న భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తగ్గించిందని ఆందోళన వ్యక్తం చేశారు.
"ఆయనకు భద్రతను పూర్తిగా తొలగించాలని లేదా కుదించాలని ఇంటెలిజెన్స్ ఏమైనా నివేదిక ఇచ్చిందా? ఒకవేళ ఇస్తే ఆ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాస్తోంది? తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి" అని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుమార్కు ఏదైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.