భారత్‌లో డేటా సెంటర్ల విప్లవం.. ఏఐతో భారీ డిమాండ్!

Data center revolution in India huge demand with AI
  • ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్‌తో భారత్‌లో పెరుగుతున్న డేటా సెంటర్ల డిమాండ్
  • గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో కీలక అంశాల వెల్లడి
  • ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా గుర్తింపు
  • ముంబై, చెన్నై ప్రధాన కేంద్రాలుగా వేగంగా విస్తరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లౌడ్ కంప్యూటింగ్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్‌గా భారత్ అవతరిస్తోందని ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. దేశంలోని యువ జనాభా, అపారమైన ఇంజినీరింగ్ నైపుణ్యం కలిగిన మానవవనరులు, ప్రభుత్వ సానుకూల విధానాలు ఈ రంగానికి మరింత ఊతమిస్తున్నాయని వివరించింది.

దేశంలో ముంబై, చెన్నై నగరాలు డేటా సెంటర్లకు ప్రధాన గమ్యస్థానాలుగా మారాయి. సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లు లభ్యత ఇందుకు ప్రధాన కారణం కాగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు నగరాలు కొనసాగుతున్నాయి. వీటికి తోడు పశ్చిమాసియా దేశాలకు వ్యూహాత్మకంగా చేరువలో ఉండటం కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమని నివేదిక పేర్కొంది.

ఈ రంగానికి సంబంధించిన తాజా గణాంకాలు కూడా ఇదే వృద్ధిని ధ్రువీకరిస్తున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం, దేశంలోని డేటా సెంటర్ల సామర్థ్యం గత ఏడాది చివరి నాటికి 1.6 గిగావాట్లకు చేరుకుంది. ప్రస్తుతం మరో 0.32 గిగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మాణ దశలో ఉండగా, 2.92 గిగావాట్ల సామర్థ్యం పనుల కోసం వివిధ సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
India Data Centers
Goldman Sachs report
Artificial Intelligence
Cloud Computing demand
Knight Frank India

More Telugu News