తిరుపతి బస్ బుకింగ్స్ ట్రెండ్.. 48 శాతం మంది 30 ఏళ్లలోపు యువతులే!
- రెడ్బస్ డేటాలో వెల్లడైన ఆసక్తికర గణాంకాలు
- తిరుపతికి పెరిగిన బస్సు టిక్కెట్ బుకింగ్స్
- జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలతో పెరిగిన భక్తుల రద్దీ
- ఏసీ, స్లీపర్ బస్సులకే యువత మొగ్గు
తిరుమలలో నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం ఉత్సవాల నేపథ్యంలో యాత్రికుల రద్దీ గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే జూన్ 20తో ముగిసిన వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి తిరుపతికి బస్సు బుకింగ్లు 22 శాతం వృద్ధి చెందాయి. తెలంగాణ నుంచి యాత్రలు ప్రారంభించేవారికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలవగా, ముఖ్యంగా ఎంజీబీఎస్, కూకట్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రయాణికులు అత్యధికంగా బయలుదేరుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తిరుపతికి వెళ్లే మొత్తం ప్రయాణికులలో 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న యువత వాటా 47 శాతంగా నమోదైంది. సాధారణంగా పెద్దవయసు వారే ఎక్కువగా తీర్థయాత్రల చేస్తారనే సంప్రదాయ స్వరూపం మారుతోందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. ప్రయాణికులు సౌకర్యానికే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం బుకింగ్స్లో 65 శాతం ఏసీ బస్సులు కాగా, 58 శాతం స్లీపర్ సర్వీసులు ఉండటం గమనార్హం.
సాధారణంగా దేశవ్యాప్తంగా తీర్థయాత్రలు చేసేవారిలో పురుషుల వాటా (సుమారు 65-69 శాతం) అధికంగా ఉంటుంది. అయితే, తెలంగాణకు సంబంధించిన తాజా గణాంకాలు యాత్రల్లో యువతుల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేస్తున్నాయి. యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, సంప్రదాయ వేడుకలు మరియు ఆధ్యాత్మిక యాత్రల పట్ల ఆసక్తి చూపుతున్నారనడానికి ఈ మార్పు ఒక నిదర్శనంగా నిలుస్తోంది.