నా కెరీర్కు థియేటరే పునాది.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అదే: విజయ్ దేవరకొండ
- నటనపై తన ఆసక్తిని రంగస్థలంపైనే కనుగొన్నానన్న విజయ్
- కెరీర్ ప్రారంభంలో ఎలాంటి అవకాశం వచ్చినా చేసేవాడినని వెల్లడి
- నటుడిగా, వ్యక్తిగా తనను థియేటర్ తీర్చిదిద్దిందని వ్యాఖ్య
- భార్య రష్మికతో కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్న విజయ్
తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ విజయ్ మాట్లాడుతూ.. "కెరీర్ ప్రారంభంలో ఫలానా ప్రాజెక్ట్ చేయాలని ఎంచుకునే అవకాశం నాకు లేదు. ఏ పని దొరికినా, ఏ వేదిక దొరికినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలనే తపన మాత్రమే ఉండేది. నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి, నా ప్రతిభను ప్రజలకు చూపించడానికి ఏదో ఒక అవకాశం కావాలి అనుకునేవాడిని" అని వివరించారు.
చిన్న వయసులోనే తనలోని శక్తిని సరైన మార్గంలో పెట్టేందుకు రంగస్థలం ఎంతగానో దోహదపడిందని విజయ్ తెలిపారు. నటుడిగా, వ్యక్తిగా తనను తీర్చిదిద్దడంలో థియేటర్ పాత్ర ఎంతో ఉందని అన్నారు. థియేటర్ మనలోని బంధనాలను తెంచి, మనకు స్వేచ్ఛను ఇస్తుందని, నటుడిగా పూర్తిగా విముక్తి కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక, విజయ్ కెరీర్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన భార్య, నటి రష్మిక మందన్నతో కలిసి ‘రణబాలి’ అనే పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూడో చిత్రమిది. వివాహం తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం ఇదే తొలిసారి కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 1850ల నాటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కని, బ్రిటిష్ వారు తప్పుగా చిత్రీకరించారని ఆరోపణలున్న కొన్ని ఘటనలను ఈ సినిమా వెలుగులోకి తీసుకురానుందని సమాచారం. ఈ చిత్రంతో పాటు ‘రౌడీ జనార్దన’, ‘VD x శౌర్యువ్ (వర్కింగ్ టైటిల్)’ అనే మరో రెండు ప్రాజెక్టులు కూడా విజయ్ చేతిలో ఉన్నాయి.