'అమ్మ'లో తీవ్ర సంక్షోభం.. శ్వేతా మేనన్ సహా కార్యవర్గ సభ్యులందరూ రాజీనామా
- 'అమ్మ'లో అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపులు
- అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేసిన శ్వేతా మేనన్
- గత బాబూరాజ్ పాలనలోనే స్కామ్ లు జరిగాయన్న శ్వేత
మలయాళ నటీనటుల సంఘం ‘అమ్మ’ (Association of Malayalam Movie Artists - AMMA) లో ఊహించని పొలిటికల్ సునామీ చెలరేగింది. అంతర్గత కుమ్ములాటలు, మతపరమైన వేధింపుల ఆరోపణలు, ఆర్థిక వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ ప్రెసిడెంట్, స్టార్ హీరోయిన్ శ్వేతా మేనన్తో పాటు మెత్తం కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. శ్వేతా మేనన్ ఏకంగా అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా వదిలేస్తున్నట్లు ప్రకటించడంతో మాలీవుడ్ నివ్వెరపోయింది.
'అమ్మ’ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా గతేడాది ఆగస్టులో జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలు అత్యున్నత పీఠాలను దక్కించుకున్నారు. శ్వేతా మేనన్ అధ్యక్షురాలిగా, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ కుక్కు పరమేశ్వరన్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నారు. కానీ లీగల్గా ఏడాది కూడా పూర్తికాకముందే ఈ కమిటీ ఘోరమైన వివాదాలతో కూలిపోయింది.
ఈ ఇండస్ట్రీ గ్రూప్ వార్కు ప్రధానం కారణం మాజీ జాయింట్ సెక్రటరీ అన్సిబా హసన్ చేసిన ఆరోపణలే. అసోసియేషన్ అధికారిక కార్యక్రమాలకు కొన్ని మత సంస్థలను స్పాన్సర్లుగా తీసుకురావడాన్ని ఆమె తీవ్రంగా అభ్యంతరపెట్టారు. దాన్ని ప్రశ్నించినందుకు కమిటీలోని కొందరు సభ్యులు తనను మత కోణంలో టార్గెట్ చేస్తూ, మానసికంగా వేధిస్తూ ఒంటరిని చేశారని అన్సిబా బహిరంగంగా విమర్శించారు. దీనికి తోడు వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రియ కూడా కమిటీ పారదర్శకతను క్వశ్చన్ చేయడంతో వివాదం పతాక స్థాయికి చేరింది.
రాజీనామా అనంతరం శ్వేతా మేనన్ ప్రెస్మీట్ పెట్టి బాంబ్ పేల్చారు. "మా కమిటీని అప్రతిష్ఠపాల్జేసి గద్దె దించడానికి తెరవెనుక కొందరు తమ సొంత ఎజెండాతో పెద్ద కుట్రలు చేశారు. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు పాత నేతలకు మళ్లీ ఈ కమిటీ బాధ్యతలు అప్పగించేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారు. నా టైంలో పైసా కూడా అవినీతి జరగలేదు, అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. అసలు స్కామ్లు, పరిపాలన అవకతవకలు జరిగింది గతంలో ఉన్న బాబూరాజ్ పాలనలోనే" అంటూ బహిరంగంగా పేర్లు బయటపెట్టారు.