అమెరికాలో తెలంగాణ విద్యార్థి ఆకస్మిక మృతి
- ఫ్లోరిడాలో ఆకస్మిక అనారోగ్యంతో అరుణ్ సాయిరెడ్డి మృతి
- ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురైన సాయిరెడ్డి
- మృతుడిది మహబూబ్నగర్ జిల్లా
ఉన్నత చదువులు చదివి, బంగారు భవిష్యత్తును వెతుక్కుంటూ అమెరికా వెళ్లిన తెలంగాణకు చెందిన మరో యువ విద్యార్థి అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయిరెడ్డి బొల్లెందుల.. ఫ్లోరిడాలో ఆకస్మికంగా సంభవించిన తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశాడు. ఈ విషాద వార్తతో ఆయన స్వగ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
అరుణ్ సాయిరెడ్డి హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లాడు. అక్కడ చదువు విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత.. ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలోని టెంపా నగరంలో నివసిస్తున్నాడు. అక్కడ స్టెమ్ ఓపీటీ (STEM OPT) కింద ఒక కంపెనీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతూ లైఫ్లో సెటిల్ అయ్యే ప్రాసెస్లో ఉన్నాడు.
ఈ నెల 19వ తేదీ వరకు స్నేహితులతో ఎంతో యాక్టివ్గా, హెల్తీగా గడిపిన అరుణ్ సాయిరెడ్డి.. ఆ తర్వాత ఉన్నట్లుండి తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. రూమ్మేట్స్, ఫ్రెండ్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతడిని స్థానికంగా ఉన్న ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చేర్చుకున్న డాక్టర్ల బృందం అరుణ్ను కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించింది. కానీ అప్పటికే పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. 26 ఏళ్లకే కొడుకు శాశ్వతంగా దూరమయ్యాడనే వార్త వినడంతో ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అరుణ్ డెడ్ బాడీని తెలంగాణకు రప్పించేందుకు అక్కడి ప్రవాస తెలుగు సంఘాలు లీగల్ ప్రాసెస్ ప్రారంభించాయి.