అప్పుడు గంభీర్ నన్ను 'ఫిక్సర్' అనే కాదు.. 'దేశద్రోహి' అని కూడా తిట్టాడు: శ్రీశాంత్
- గంభీర్పై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన శ్రీశాంత్
- లెజెండ్స్ లీగ్ క్రికెట్లో బౌన్సర్ వేసినందుకు గంభీర్ దూషించాడని వెల్లడి
- గంభీర్ ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యం
'లల్లాన్టాప్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆనాటి ఘటనను వివరిస్తూ.. "నేను గంభీర్కు బౌన్సర్ వేశాను. అతను తొలి బంతికే స్టెప్-అవుట్ అయి ఫ్లిక్ చేశాడు. ఎందుకంటే నా ఆట గురించి అతనికి బాగా తెలుసు. అతను చాలా మంచి క్రికెటర్. కోచింగ్ గురించి నాకు తెలియదు కానీ, ఆటగాడిగా అతను అద్భుతం. నేను బౌన్సర్ వేయగానే, గంభీర్ నా దగ్గరకు వచ్చి దుర్భాషలాడాడు. అతను అనకూడని మాటలు అన్నాడు. నన్ను 'ఫిక్సర్' అని పిలిచాడు" అని శ్రీశాంత్ తెలిపాడు.
"నేను అతని వైపు వంగి, 'గౌతీ భాయ్, అంతా ఓకేనా?' అని అడిగాను. నేను భారీ కాయంతో ఉండటంతో కొడతానని అతను భావించినట్లున్నాడు. వెంటనే అతను తిట్ల పురాణం అందుకున్నాడు. మళ్లీ మళ్లీ 'ఫిక్సర్', 'దేశద్రోహి' అని దూషించాడు" అంటూ శ్రీశాంత్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను బౌన్సర్ వేసినందుకే గంభీర్ అలా రెచ్చిపోయాడని వివరించాడు.
ఒకప్పుడు భారత జట్టులో సహచరులుగా ఉన్న గంభీర్, శ్రీశాంత్ 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్లు గెలిచిన జట్లలో సభ్యులు. అయితే, రిటైర్మెంట్ తర్వాత వారి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2013 ఐపీఎల్ సీజన్లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్పై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు జోక్యంతో ఆ నిషేధాన్ని ఏడేళ్లకు కుదించారు. దీంతో శ్రీశాంత్ 2020లో తిరిగి క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఈ ఫిక్సింగ్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకునే గంభీర్ అలా దూషించి ఉంటాడని భావిస్తున్నారు.
ప్రస్తుతం గౌతమ్ గంభీర్ భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. అతని మార్గదర్శకత్వంలోనే టీమిండియా 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 2026లో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుని అద్భుత విజయాలను నమోదు చేసింది. ఇంతటి కీలకమైన పదవిలో ఉన్న వ్యక్తిపై శ్రీశాంత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ వివాదంపై గంభీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.