కోల్కతాలో నారా లోకేశ్ జోరు... 5 గంటల వ్యవధిలో ఏకంగా 17 సమావేశాలు!
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా కోల్కతాలో మంత్రి లోకేశ్ పర్యటన
- ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సదస్సులో పాల్గొన్న మంత్రి
- కేవలం 5 గంటల వ్యవధిలో 17 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం
- ఐటీసీ, శ్యామ్ ఫెర్రో, విక్రమ్ సోలార్, కోల్ ఇండియా వంటి సంస్థలతో చర్చలు
- ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, అవకాశాలను వివరించిన లోకేశ్
మధ్యాహ్నం ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత, లోకేశ్ విరామం లేకుండా పారిశ్రామికవేత్తలతో భేటీల పరంపర కొనసాగించారు. ఈ పర్యటనలో భాగంగా ఎమామీ గ్రూప్ ఆదిత్య అగర్వాల్, వీసా స్టీల్ విశాల్ అగర్వాల్, శ్రీ సిమెంట్ ప్రశాంత్ బంగుర్లతో లోకేశ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.
ఐటీసీ ఛైర్మన్ సంజీవ్ పురితో భేటీ అయి, రాష్ట్రంలో కొనసాగుతున్న హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, కుప్పంలో ఏర్పాటు చేస్తున్న హార్టికల్చర్ క్లస్టర్ల పురోగతిపై సమీక్షించారు. శ్యామ్ ఫెర్రో ఛైర్మన్ బ్రిజ్ భూషణ్ అగర్వాల్తో సమావేశమై, ఏపీలో రాబోయే వారి గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా, కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) ప్రతినిధులతో సమావేశమై, ఏపీ జెన్కోతో భాగస్వామ్యం, పునరుత్పాదక ఇంధనం, రేర్ ఎర్త్స్ వంటి రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించారు. విక్రమ్ సోలార్ నాయకత్వంతో భేటీ అయి, ఏపీలో సోలార్ సెల్, బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.
ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులతో వారి బ్యాటరీ, ఈవీ తయారీ ప్రణాళికలు, నైపుణ్యాభివృద్ధి భాగస్వామ్యంపై చర్చించారు. బెర్రీ అల్లాయ్స్ వంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కంపెనీల ప్రతినిధులతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
ఐ.సి.సి ఐటీ సభ్యులతోనూ ప్రత్యేకంగా సమావేశమై ఏపీలోని ఐటీ, జీసీసీ రంగాల్లోని అవకాశాలను వివరించారు. ఈ వరుస సమావేశాలతో లోకేశ్ తన కోల్కతా పర్యటనను పూర్తిగా పెట్టుబడుల వేటకే అంకితం చేశారు.