ఫోన్ ట్యాపింగ్ కేసు.. చికోటి ప్రవీణ్ ను విచారించిన సిట్
- తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందనే విషయంపై గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేశానన్న ప్రవీణ్
- ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్రావు కీలక పాత్ర పోషించారని ఆరోపణ
- 2 వేలకు పైగా ఫోన్లను ట్యాపింగ్ చేశారన్న ప్రవీణ్
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా బీజేపీ నేత చికోటి ప్రవీణ్ను బంజారాహిల్స్లోని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి, ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేశారు.
విచారణ అనంతరం బయటకు వచ్చిన చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందంటూ గతంలోనే తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని గుర్తుచేశారు. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు ఈ అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో అత్యంత కీలక పాత్ర పోషించారని నేరుగా ఆరోపించారు. కేవలం కొందరివే కాకుండా, ఏకంగా 2 వేలకు పైగా ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారని అన్నారు.
ఈ కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పెద్ద తలకాయల నిజాలు బయటకు రావాలంటే నిందితులకు వెంటనే ‘నార్కో అనాలసిస్ టెస్ట్’ చేయాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. అలాగే రాధాకిషన్రావు కూడబెట్టిన అక్రమ ఆస్తులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలన్నారు. ఒకవేళ ఇక్కడి అధికారులు గనుక పట్టించుకోకపోతే.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐలకు లేఖ రాస్తానని హెచ్చరించారు.