జియో మెగా ఐపీఓ.. నేడే సెబీకి దరఖాస్తు

Jio Mega IPO Application to SEBI Today
  • ఈరోజే సెబీకి ముసాయి పత్రాలు
  • 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రకటించిన ముకేశ్‌ అంబానీ
  • తన వారసులు ఈ ఐపీఓను ముందుండి నడిపిస్తున్నారని ప్రకటన
  • ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా అంచనా
  • భారత్‌లోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డు సృష్టించే అవకాశం
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓకు తెరలేచింది. ప్రముఖ డిజిటల్, టెలికాం దిగ్గజం ‘జియో ప్లాట్‌ఫామ్స్’ ఐపీఓకు వెళ్లేందుకు బోర్డు ఆమోదం తెలిపిందని, దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ రోజే సెబీకి సమర్పించబోతున్నామని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 

దివంగత ధీరూభాయ్ అంబానీ ఆశయాలను తాను ముందుకు తీసుకెళ్లినట్లే ఇప్పుడు తన వారసులు ఆకాశ్‌, ఈశా, అనంత్ అంబానీలు ఈ జియో ఐపీఓ ప్రక్రియను ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో సరికొత్త వృద్ధి అవకాశాలకు వారు నాయకత్వం వహిస్తారని పేర్కొన్నారు. గ్లోబల్ స్థాయిలో సాంకేతిక కంపెనీలను భారత్ నిర్మించగలదని ఈ జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుందన్నారు.

పదేళ్ల క్రితం భారత్‌లో వాయిస్ కాల్స్, డేటా ధరలు అధికంగా, స్పీడ్ చాలా తక్కువగా ఉండేవని ముకేశ్‌ గుర్తుచేశారు. దేశంలో ‘డిజిటల్ అసమానతలను’ తొలగించాలనే లక్ష్యంతోనే జియో ప్రయాణం మొదలైందని తెలిపారు. వాయిస్ కాల్స్‌ను పూర్తిగా ఉచితం చేసి హై-స్పీడ్ డేటాను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి భారతీయుడికి ‘డిజిటల్ లైఫ్’ను సాధ్యం చేసిన జియో.. ఇప్పుడు తన తదుపరి పెద్ద మిషన్‌కు సిద్ధమవుతోందని స్పష్టం చేశారు.

ఈ జియో ఐపీఓ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవబోతోంది. నివేదికల ప్రకారం.. ఈ ఐపీఓ విలువ సుమారు రూ.33,600 కోట్లుగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ అంచనా ప్రకారం రిలయన్స్ జియో మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.15,12,000 కోట్లుగా ఉంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన ఐపీఓల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ అతిపెద్దది. దీని విలువ రూ. 27,870 కోట్లు. ఇప్పుడు రాబోతున్న జియో ఐపీఓ ఆ రికార్డును అధిగమించనుంది.

ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్ 52.40 కోట్ల మంది ఖాతాదారులతో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా రికార్డు సృష్టించింది. ఇందులో కేవలం జియో 5జీ నెట్‌వర్క్‌ను వాడుతున్న వారి సంఖ్యే 26.80 కోట్లుగా ఉంది. అలాగే వీరి సరికొత్త హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అయిన ‘జియో ఎయిర్ ఫైబర్’ ఇప్పటికే 1.30 కోట్ల ఇళ్లకు కనెక్ట్ అయి ఉంది.
Go Back to Shorts
Jio Platforms
Mukesh Ambani
Jio IPO
SEBI
Reliance Industries AGM
Biggest IPO in India

More Telugu News