న్యూయార్క్ నగరంలో గుర్రపు బండి బోల్తాపడి భారతీయుడి మృతి
- న్యూయార్క్ సెంట్రల్ పార్క్లో గుర్రపు బగ్గీ బోల్తాపడి విషాదం
- ప్రమాదంలో 18 ఏళ్ల భారతీయ పర్యాటకుడు రోమాంచ్ మహాజన్ మృతి
- ఫోటో తీసేందుకు డ్రైవర్ బగ్గీ దిగడంతో బెదిరిపోయిన గుర్రం
రోమాంచ్ తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి న్యూయార్క్ను సందర్శించేందుకు వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం కుటుంబంతో కలిసి సెంట్రల్ పార్క్లో గుర్రపు బగ్గీలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. చెర్రీ హిల్, బెథెస్డా ఫౌంటెన్ సమీపంలో ఫోటోలు దిగేందుకు బగ్గీని ఆపారు. ఆ సమయంలో డ్రైవర్ వారి ఫోటో తీయడానికి బండి దిగగా, గుర్రం అకస్మాత్తుగా బెదిరిపోయి వేగంగా ముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో అదుపుతప్పిన బగ్గీ మరో బండిని ఢీకొని బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో బండిలోంచి కిందపడిన రోమాంచ్కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతని కుటుంబ సభ్యులకు ఎలాంటి తీవ్ర గాయాలు కాలేదు.
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను బగ్గీ డ్రైవర్ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటనతో న్యూయార్క్లో గుర్రపు బగ్గీల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. రోమాంచ్ మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు భారత కాన్సులేట్ అధికారులు, స్థానిక భారతీయ సంఘాలు బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నాయి.