విద్యతోనే జీవితాల్లో మార్పు.. ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూడొద్దు: రేవంత్ రెడ్డి

Revanth Reddy says education changes lives and government schools should not be underestimated
  • ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించిన సీఎం
  • విద్యారంగానికి రూ.27 వేల కోట్ల వ్యయం చేస్తున్నట్లు వెల్లడి
  • త్వరలో స్పోర్ట్స్ యూనివర్సిటీ
  • కులవివక్ష నిర్మూలన లక్ష్యంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
  • ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామన్న సీఎం
తెలంగాణ భవిష్యత్ పునర్నిర్మాణం అద్దాల మేడల్లో కాదని.. తరగతి గదుల్లోనే ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడని తెలిపారు. విద్య ఒక్కటే జీవితాలను సమూలంగా మార్చగలదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రి, ఐఏఎస్‌, ఐపీఎస్‌, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ప్రజాప్రతినిధులు కావచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడాన్ని ఎవరూ చిన్నతనంగా భావించవద్దని సూచించారు.

రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను బుధవారం ప్రారంభించిన సీఎం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పాఠశాల రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.27 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచస్థాయి విద్యా సంస్థల వరకు పరిశీలించి విద్యా కమిషన్‌ ఛైర్మన్‌ ఆకునూరి మురళి సమగ్ర నివేదిక అందించారని చెప్పారు. దాని ఆధారంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ల ఆలోచనకు రూపం ఇచ్చామని వివరించారు. నాణ్యమైన విద్య అందరికీ చేరాలన్న లక్ష్యంతో ఆరుట్ల గ్రామాన్ని ఎంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ పాఠశాలలో ప్రవేశాల కోసం భారీ స్పందన రావడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. 'నో అడ్మిషన్స్' బోర్డు పెట్టాల్సిన పరిస్థితి రావడం ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని అన్నారు. పాఠశాల సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.

నిజాం పాలన, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి వంటి మహనీయుల స్ఫూర్తి ఉన్న నేలపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వారి పోరాట స్ఫూర్తి ఇక్కడి విద్యార్థుల్లోనూ కనిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఈ పాఠశాలను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ, ఆరుట్లను ఎంచుకోవడం వెనుక ఇదే కారణమని చెప్పారు.

విద్యతో పాటు నైపుణ్యాలు కూడా అవసరమని సీఎం పేర్కొన్నారు. కేవలం చదువు మాత్రమే సరిపోదని, విద్యార్థుల్లో వృత్తి నైపుణ్యాలు పెరగాలని అన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ శిక్షణ పొందిన యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు.

క్రీడల రంగంలోనూ తెలంగాణ మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఆరుట్ల విద్యార్థులు ఫుట్‌బాల్ అద్భుతంగా ఆడారని ప్రశంసించారు. క్రీడల్లో వెనుకబాటుతనాన్ని అధిగమించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్‌కు తీసుకువచ్చి యువ క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపాలని ప్రయత్నించినట్లు తెలిపారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తామని వెల్లడించారు.

సమాజంలో కులవివక్షను తగ్గించే దిశగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌ను తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారానే గ్రామీణ ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని సంకల్పించామని పేర్కొన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ వసతులు, నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Telangana Public School
Arutla Rangareddy
Telangana Education Reforms
Young India Skill University
Government Schools Telangana

More Telugu News