దశాబ్దాల కల సాకారం.. నిడమర్రు ఆర్వోబీకి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేశ్‌

Nara Lokesh lays foundation stone for Nidamarru ROB fulfilling decades long dream
నిడమర్రులో రూ.142 కోట్ల ఆర్వోబీ నిర్మాణ పనులకు శంకుస్థాపన
మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చేతుల మీదుగా పనులు ప్రారంభం
దశాబ్దాలుగా ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారం
మంగళగిరి, అమరావతి, తాడికొండ మధ్య సులభతరం కానున్న రాకపోకలు
ప్రాజెక్టు నిర్మాణంతో గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం 
మంగళగిరి నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కీలక ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. నియోజకవర్గ పరిధిలోని నిడమర్రు వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేడు శంకుస్థాపన చేశారు. నంబూరు-మంగళగిరి సెక్షన్‌లోని 14వ నెంబర్ రైల్వే లెవల్ క్రాసింగ్ వద్ద రూ.142 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి హాజరైన లోకేశ్‌, పెమ్మసానిలకు టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

ఈ మార్గంలో రైల్వే లెవల్ క్రాసింగ్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజుకు సుమారు 60 రైళ్లు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో గేటు మూసివేసే సమయం సగటున 8 నుంచి 10 గంటల వరకు ఉంటోంది. గేటు వేసిన ప్రతిసారీ ప్రయాణికులు 10 నుంచి 15 నిమిషాల పాటు వేచి చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఆర్వోబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే నిమిషంలోపే రైల్వే లైన్‌ను దాటే అవకాశం కలుగుతుంది.

ఈ ఆర్వోబీ నిర్మాణం మంగళగిరి, రాజధాని అమరావతి, తాడికొండ నియోజకవర్గాల మధ్య అనుసంధానతను పెంచనుంది. ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుంది. అమరావతికి నిరంతరాయ రవాణా సౌకర్యం ఏర్పడి, ఈ ప్రాంతంలో భవిష్యత్తులో పట్టణీకరణ, ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది.

రైల్వే లైన్‌పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించే ఈ ఆర్వోబీ మొత్తం పొడవు 767.50 మీటర్లు. ఇందులో అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్ల మేర నిర్మాణం చేపడతారు. వంతెనపై నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయనున్నారు. సర్వీస్ రోడ్లతో కలిపి ఆర్వోబీ మొత్తం వెడల్పు 28 మీటర్లు ఉండనుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయ్, ఇతర కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
Pemmasani Chandrasekhar
Nidamarru ROB Mangalagiri
Amaravati Infrastructure
Andhra Pradesh Development
Railway Over Bridge Nidamarru

More Telugu News