నీట్ రీ-టెస్ట్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. "టెలిగ్రాం' నిషేధం!

Central Government suspends Telegram services to prevent NEET paper leak rumors
  • జూన్‌ 22 వరకు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
  • ఎన్‌టీఏ సూచనల మేరకు చర్యలు
  • పేపర్‌ లీక్‌ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానళ్లు
  • అభ్యర్థుల నుంచి రూ.లక్షలు వసూలు చేస్తున్న ముఠాలు
  • సైబర్‌ క్రైమ్‌ చర్యలు ఫలించకపోవడంతో నిర్ణయం
  • పరీక్షల పారదర్శకత కోసమే ఆంక్షలు
నీట్‌-యూజీ రీ-టెస్ట్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు సంబంధించిన తప్పుడు సమాచారం, నకిలీ ప్రశ్నపత్రాలు, పేపర్‌ లీక్‌ ప్రచారాన్ని అడ్డుకునేందుకు టెలిగ్రామ్‌ సేవలను జూన్‌ 22 వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. పరీక్షల పారదర్శకతను కాపాడడం, అభ్యర్థులను మోసం చేసే ప్రయత్నాలను అరికట్టడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని అధికారులు వెల్లడించారు.

ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార సాంకేతిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పలు టెలిగ్రామ్‌ ఛానళ్లలో నీట్‌ ప్రశ్నపత్రాలు లీకయ్యాయని ప్రచారం చేస్తూ విద్యార్థులు, వారి కుటుంబాల నుంచి రూ.లక్షలు వసూలు చేసే ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది.

‘PAPER LEAKED NEET’, ‘Re-NEET 2026’, ‘Private Mafia’ వంటి పేర్లతో నడుస్తున్న కొన్ని ఛానళ్లు ప్రశ్నపత్రాలు అందిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాయని అధికారులు తెలిపారు. అయితే అసలు ప్రశ్నపత్రం పటిష్ఠ భద్రత మధ్య ఉంటుందని, బయటకు లీకయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రకటనలన్నీ పూర్తిగా మోసపూరితమైనవేనని హెచ్చరించారు.

‘ఇప్పటికే ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌’ ద్వారా ఆయా ఛానళ్లపై చర్యలు తీసుకునేందుకు ఎన్‌టీయే చర్యలు చేపట్టింది. కానీ, ఆశించిన ఫలితం రాకపోవడంతో టెలిగ్రామ్‌పైనే తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. పరీక్షల విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
Go Back to Shorts
Central Government
NEET UG
Telegram Ban
Paper Leak
National Testing Agency
NEET Re-test

More Telugu News