100 మీటర్ల లోయలో పడిన బస్సు.. ఇథియోపియాలో 31 మంది మృతి

  • అమ్హారా రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘటన
  • డజన్ల కొద్దీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యుల ఆందోళన
  • ప్రమాదకరమైన ఘాట్ రోడ్డే కారణమని ప్రాథమిక అంచనా
ఇథియోపియాలోని ఉత్తర అమ్హారా (Amhara) రీజియన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ఒక బస్సు.. ప్రమాదకరమైన ఘాట్ రోడ్డుపై నియంత్రణ కోల్పోయి సుమారు 100 మీటర్ల (330 అడుగులు) లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కనీసం 31 మంది ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, డజన్ల కొద్దీ ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మృతులలో బస్సు డ్రైవర్ కూడా ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు.

ఈ బస్సు డెస్సీ ప్రాంతం నుంచి రాజధాని అడిస్ అబాబాకు వెళ్తుండగా కొంబోల్చా పరిధిలోని కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు బస్సు పూర్తిగా నలిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే రక్షణ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. శవాల దిబ్బగా మారిన ఆ లోయ నుంచి మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన 33 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన అమ్హారా ప్రాంతంలోని కొండ రహదారులు అత్యంత ప్రమాదకరమైనవిగా పేరుగాంచాయి. ఇరుకైన మలుపులు, లోతైన లోయలు ఉండటం వల్ల ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తాజా ప్రమాదానికి వాహనంలో సాంకేతిక లోపం కారణమా? డ్రైవర్ నిర్లక్ష్యమా? లేక రోడ్డు సరిగ్గా లేకపోవడమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాద మరణాలు సంభవించే దేశాల్లో ఇథియోపియా ఒకటి. 2024 డిసెంబర్‌లో సిదామా ప్రాంతంలో జరిగిన ఇలాంటి బస్సు ప్రమాదంలోనే ఏకంగా 66 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. 

Ethiopia Bus Accident
Amhara Region
Dessie to Addis Ababa
Fatal Road Crash
Kombolcha Gorge Accident
Ethiopia Road Mishap

More Telugu News