కిడ్నీ మరణాల్లో తెలంగాణ టాప్.. ఐసీఎంఆర్ నివేదికలో షాకింగ్ నిజాలు!
- కిడ్నీ వ్యాధుల మరణాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానం
- ఐసీఎంఆర్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడి
- అదుపులేని మధుమేహమే ప్రధాన కారణమని గుర్తింపు
- ప్రతి లక్ష మంది జనాభాలో 19 మందికి పైగా మృత్యువాత
- వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిపుణుల సూచన
ఢిల్లీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ వైద్య నిపుణులు ఈ పరిశోధన చేపట్టారు. 1990 నుంచి 2023 వరకు 'గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్' గణాంకాలను ఆధారంగా చేసుకుని దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కిడ్నీ వ్యాధుల సరళిని, మరణాల రేటును లోతుగా విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ప్రతి లక్ష మంది జనాభాలో 10,601 మంది దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తేలింది. దేశంలోనే అతి తక్కువగా రాజస్థాన్లో ప్రతి లక్ష మందికి 6.71 మరణాలు నమోదవుతుండగా, తెలంగాణలో ఈ సంఖ్య గరిష్ఠంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వ్యాధి కారణంగా ప్రజలు ఆరోగ్యకరమైన జీవితకాలాన్ని కోల్పోవడంలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
మధుమేహమే ప్రధాన ముప్పు
రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం అదుపులో లేని మధుమేహమేనని పరిశోధకులు తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా నమోదయ్యే కిడ్నీ కేసుల్లో షుగర్ వ్యాధి పాత్ర 18% నుంచి 24% మధ్యలో ఉండగా, తెలంగాణలో ఈ శాతం చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మధుమేహాన్ని సకాలంలో గుర్తించకపోవడం, చికిత్స తీసుకుంటున్నా రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోకపోవడం వంటి కారణాల వల్ల కిడ్నీలు వేగంగా దెబ్బతింటున్నాయని అధ్యయనం వివరించింది. ముఖ్యంగా పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలే ఈ వ్యాధికి ఎక్కువగా బలవుతున్నారని, వ్యాధి ప్రాథమిక దశలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవడం, సరైన అవగాహన లేకపోవడంతో సమస్య ముదిరిన తర్వాతే ఆసుపత్రులకు వస్తున్నారని పేర్కొంది.
ప్రభుత్వానికి నిపుణుల సూచనలు
ఈ భయంకరమైన పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పరిశోధకులు ప్రభుత్వానికి కొన్ని కీలక సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధుల నివారణను ప్రభుత్వం ఒక ప్రాధాన్యతాంశంగా గుర్తించి, బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని సిఫార్సు చేశారు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్న రోగులందరికీ గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఉచితంగా క్రియాటినిన్, మూత్ర పరీక్షలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. తద్వారా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి, తీవ్రతను తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా, పేద రోగులకు ఉచిత డయాలసిస్, కిడ్నీ మార్పిడి సేవలను మరింత విస్తృతం చేసి, సులభంగా అందుబాటులోకి తీసుకురావాలని, ఇందుకోసం వైద్య మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలని నిపుణులు స్పష్టం చేశారు.