డెత్ వ్యాలీ... భూమిపై నరకం అంటే ఇదే!
- భూమిపై అత్యంత వేడి ప్రాంతంగా పేరుగాంచిన డెత్ వ్యాలీ
- 1913లోనే 56.7 డిగ్రీల సెల్సియస్ రికార్డు ఉష్ణోగ్రత నమోదు
- తెల్లవారుజామునే పనులు, ఏసీలు లేకుండా జీవించలేని పరిస్థితి
- తీవ్రమైన వేసవి ఉన్నా.. ఆహ్లాదకర శీతాకాలం, ప్రకృతి కోసం అక్కడే నివాసం
- పర్యాటకులు ఫోటోల కోసం వస్తే, స్థానికులకు మాత్రం అదే సొంత ఇల్లు
సముద్ర మట్టానికి దిగువన, చుట్టూ పర్వతాలు ఉండటంతో ఇక్కడ వేడి బయటకు పోకుండా చిక్కుకుపోతుంది. పొడి గాలి, ఇసుక, ఉప్పు నేలలు సూర్యరశ్మిని పరావర్తనం చెందించడంతో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెడితే, ఒకేసారి కొన్ని హెయిర్ డ్రయర్లతో ముఖంపై వేడిగాలి కొట్టినట్లు లేదా ఎప్పుడూ తెరిచి ఉంచిన ఓవెన్ ముందు నిలబడినట్లు అనిపిస్తుందని స్థానికులు చెబుతారు. ఇక్కడ చెమట పట్టినా, వెంటనే ఆవిరైపోవడంతో శరీరంపై తేమ కనిపించదు. కానీ, శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. సూర్యోదయం వేళకే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల వరకు నమోదవుతాయి. లోహపు వస్తువులను తాకితే చేతులు కాలిపోతాయి.
ఈ తీవ్రమైన పరిస్థితులకు అలవాటుపడిన స్థానికులు తమ జీవనశైలిని పూర్తిగా మార్చుకున్నారు. పనులు, ఇతర అవసరాల కోసం తెల్లవారుజామున లేదా సూర్యాస్తమయం తర్వాతే బయటకు వెళతారు. ఇళ్లలో నిరంతరం ఏసీలు పనిచేయాల్సిందే. కిటికీలకు నల్లటి కర్టెన్లు వాడతారు. విద్యుత్ సరఫరా నిలిచిపోతే అత్యవసర పరిస్థితిగా భావిస్తారు. ఎందుకంటే ఏసీ ఆగిపోతే ఇళ్లలోని ఉష్ణోగ్రత నిమిషాల్లోనే ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.
ఇంతటి కఠిన పరిస్థితులు ఉన్నా, ఇక్కడి ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లరు. వేసవిలో నరకంలా ఉన్నా, శీతాకాలం మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎడారి ప్రకృతి సౌందర్యం, రాత్రిపూట నక్షత్రాలతో నిండిన ఆకాశం, ప్రశాంతమైన వాతావరణం తమను ఇక్కడే ఉండేలా చేస్తాయని వారు చెబుతారు. పర్యాటకులకు అదొక వింత అనుభూతి అయితే, స్థానికులకు మాత్రం ఆ మృత్యులోయే వారి ఇల్లు.