పెట్రోల్, డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఈవీ షోరూంలకు క్యూ కట్టిన జనం... డెలివరీలు ఇవ్వలేక కంపెనీల ఆపసోపాలు!

Electric Vehicles demand surges in India as petrol and diesel prices rise
  • పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఎలక్ట్రిక్ కార్లకు భారీ గిరాకీ
  • ప్రముఖ కంపెనీల ఈవీ మోడళ్ల డెలివరీకి మూడు నెలల వరకు వెయిటింగ్
  • పశ్చిమాసియా సంక్షోభంతో నాలుగేళ్ల తర్వాత భారీగా పెరిగిన ఇంధన ధరలు
  • మే నెలలో రికార్డు స్థాయిలో 26,000 దాటిన ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
  • డిమాండ్‌కు తగినట్టు ఉత్పత్తిని పెంచేందుకు కంపెనీల ప్రయత్నాలు
దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో, వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఈవీ కార్లకు ఒక్కసారిగా గిరాకీ పెరిగి, డెలివరీ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, మహీంద్రా వంటి ప్రముఖ కంపెనీల పాపులర్ మోడళ్ల కోసం ప్రస్తుతం మూడు నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది.

పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా గత నాలుగేళ్లలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఢిల్లీ సహా పలు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్కును దాటింది. ఈ పరిణామం ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు కీలక మలుపుగా మారింది. ఇప్పటివరకు అధిక ధరలు, ఛార్జింగ్ సదుపాయాల కొరత వంటి కారణాలతో ఈవీల కొనుగోలుకు వెనుకాడిన వినియోగదారులు, ఇప్పుడు వాటిపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.

మార్చి నెల నుంచి తమ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల (బీఈవీ) డిమాండ్ 40 శాతం మేర పెరిగిందని మెర్సిడెస్-బెంజ్ ఇండియా వెల్లడించింది. ఏప్రిల్‌లో విడుదలైన సీఎల్‌ఏ బీఈవీ మోడల్‌కు రెండు నుంచి మూడు నెలల వెయిటింగ్ పీరియడ్ సమయం ఉందని, దీనివల్ల డీలర్లు కొత్త బుకింగ్స్‌ను నిలిపివేశారని కంపెనీ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. బీఎండబ్ల్యూ ఇండియా సైతం ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొంటోంది. మే నెలలో ఆ కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 33 శాతానికి చేరుకోవడం విశేషం.

దేశీయ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకికి చెందిన కొత్త ఈ-విటారా ఎస్‌యూవీ బుకింగ్స్ గత నెలలో రెట్టింపయ్యాయని, దీంతో 6 నుంచి 8 వారాల నిరీక్షణ తప్పడం లేదని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ వివరించారు. అదేవిధంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 9ఈ మోడల్‌కు 6 నుంచి 8 వారాలు, టాటా మోటార్స్ పంచ్, టియాగో ఈవీలకు సుమారు 6 వారాల వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతోంది.

2026 మేలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో 26,000 యూనిట్లను దాటాయి. ఇది గతేడాదితో పోలిస్తే 80 శాతం అధికం కావడం గమనార్హం. మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ఈవీల వాటా తొలిసారిగా 11 శాతాన్ని అధిగమించింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచేందుకు ఆటోమొబైల్ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ, సరఫరా వ్యవస్థలో తలెత్తిన సమస్యలు సవాలుగా మారాయి. ఇంధన ధరల అనిశ్చితి నేపథ్యంలో, ఆర్థికంగా పొదుపు మార్గంగా వినియోగదారులు సహజంగానే ఈవీల వైపు ఆకర్షితులవుతున్నారు.
Go Back to Shorts
Electric Vehicles
Petrol and diesel price hike
Maruti Suzuki e-Vitara
Tata Motors EV
Mahindra XUV 9e

More Telugu News