ఎంజీఆర్, జయ బాటలో సీఎం విజయ్.. కొల్లూరు మూకాంబిక అమ్మవారికి వెండి కత్తి సమర్పణ
- కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు విజయ్
- ఆలయానికి 1.6 కిలోల వెండి ఖడ్గాన్ని కానుకగా సమర్పణ
- ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఇదే ఆయన తొలి రాష్ట్రేతర పర్యటన
- గతంలో ఎంజీఆర్, జయలలిత కూడా ఇదే ఆలయాన్ని సందర్శించారు
- ఈ పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదేనన్న అధికారులు
తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తరపున విజయం సాధించి, మే నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ రాష్ట్రం వెలుపల పర్యటించడం ఇదే తొలిసారి. ఢిల్లీ నుంచి విమానంలో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సుమారు 125 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి చేరుకున్నారు. సంప్రదాయ వస్త్రధారణలో వచ్చిన విజయ్కు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని, దాదాపు 20 నిమిషాల పాటు గర్భగుడిలో గడిపి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
గతంలో తమిళనాడు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎం.జి. రామచంద్రన్ (ఎంజీఆర్), జానకీ రామచంద్రన్, జె. జయలలిత సైతం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఒక సంప్రదాయంగా వస్తోంది. వారి బాటలోనే విజయ్ కూడా అమ్మవారిని దర్శించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
విజయ్ పర్యటన సందర్భంగా మంగళూరు విమానాశ్రయం, కొల్లూరు ఆలయ పరిసరాల్లో కర్ణాటక, తమిళనాడు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన పర్యటన పూర్తిగా ఆధ్యాత్మికమైనదని, ఇందులో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు లేవని అధికారులు వెల్లడించారు. దర్శనం అనంతరం విజయ్ తిరిగి చెన్నైకు బయలుదేరి వెళ్లారు.