బెంగాల్‌కు టాటాను తిరిగి తీసుకొస్తాం: సీఎం సువేందు అధికారి ప్రకటన

  • టాటా గ్రూప్‌ను తిరిగి పశ్చిమ బెంగాల్‌కు తీసుకొస్తామని సీఎం ప్రకటన
  • 2008లో సింగూర్ నుంచి వెళ్లిపోయిన టాటా నానో ప్రాజెక్టు
  • భూసేకరణలో పాత తప్పులు పునరావృతం కావని ప్రభుత్వం హామీ
  • గత వామపక్ష, తృణమూల్ ప్రభుత్వాల విధానాలను విమర్శించిన సువేందు
పశ్చిమ బెంగాల్‌లో పారిశ్రామిక పెట్టుబడులను తిరిగి పట్టాలెక్కించే పెట్టే దిశగా నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక ప్రకటన చేశారు. సుమారు రెండు దశాబ్దాల క్రితం రాష్ట్రం నుంచి తరలివెళ్లిన టాటా గ్రూప్‌ను మళ్లీ వెనక్కి తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం కోల్‌కత్తాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "టాటాలను మేము తిరిగి బెంగాల్‌కు తీసుకువస్తాం" అని ప్రకటించారు.

సుమారు 18 ఏళ్ల క్రితం సింగూర్‌లో టాటా నానో కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుపై తలెత్తిన వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నాటి వామపక్ష ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ అప్పటి ప్రతిపక్ష నేత మమతా బెనర్జీ నేతృత్వంలో భారీ ఎత్తున ఉద్యమం జరిగింది. ఈ ఆందోళనల కారణంగా టాటా మోటార్స్ తన ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించగా, ఈ పరిణామం బెంగాల్ పారిశ్రామిక రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.

ఈ నేపథ్యంలో సువేందు అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బలవంతపు భూసేకరణతో వామపక్ష ప్రభుత్వం, కేవలం ప్రచారానికే పరిమితమైన పరిశ్రమలతో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తమ బీజేపీ ప్రభుత్వం అవినీతికి, మధ్యవర్తులకు తావులేకుండా పారదర్శక విధానాలతో పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

2026 అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన బీజేపీ, 15 ఏళ్ల టీఎంసీ పాలనకు తెరదించిన విషయం విదితమే. గడిచిన మే నెలలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సువేందు అధికారి, రాష్ట్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్ని ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతగా ప్రకటించారు.

Suvendu Adhikari
Tata Group
West Bengal
Singur Nano Project
Industrial Development
BJP West Bengal

More Telugu News