లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్నారు.. డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరిపించాలి: వైఎస్ జగన్
- మెగా డీఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందన్న వైఎస్ జగన్
- నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
- స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడి తమవారికి ఉద్యోగాలిచ్చారని ఆరోపణ
- చంద్రబాబు, లోకేశ్లే ముద్దాయిలు కాబట్టి న్యాయం జరగదని వ్యాఖ్య
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం కుంభకోణాలతో లక్షలాది మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేసిందని, ప్రతిభావంతులైన నిరుద్యోగుల జీవితాలను తీవ్రంగా దెబ్బతీసిందని జగన్ ఆరోపించారు. ఇంతటి దారుణమైన నియామక ప్రక్రియను ఎక్కడా చూడలేదని అన్నారు. "అబద్ధాలు, మోసం, దగా, వెన్నుపోటు, కుంభకోణాలకు చొక్కా, ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతారు" అని ఆయన విమర్శించారు. లక్షలాది మంది యువత ఆశలు, భవిష్యత్తు ముడిపడి ఉన్న డీఎస్సీ వంటి ప్రక్రియలో కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడటం అత్యంత దారుణమని అన్నారు.
‘మేమూ బొద్దింకలమే.. జనరేషన్ జెడ్ చూస్తోంది’
ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను జనరేషన్ జెడ్ (Gen Z) గమనిస్తోందని చంద్రబాబు గుర్తుంచుకోవాలని జగన్ హెచ్చరించారు. "చంద్రబాబూ గుర్తుంచుకో, ఇది జెన్ జెడ్. జెన్ ఆల్ఫా కూడా వస్తోంది. తప్పులు ఒప్పుకోకుండా ఇబ్బంది పెడితే బొద్దింకలు తిరగబడతాయి" అని వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్ తర్వాత ఆన్లైన్లో మొదలైన ‘జనతా కాక్రోచ్ పార్టీ’ ఉద్యమం గురించి ప్రస్తావించగా, "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేం కూడా బొద్దింకలమే. యువతకు అన్యాయం జరిగితే వారు ఇలాంటి మార్గాలనే ఎంచుకుంటారు" అని జగన్ పేర్కొన్నారు.
అక్రమాలపై జగన్ వివరణ
డీఎస్సీ అక్రమాలపై జగన్ వివరంగా మాట్లాడుతూ.. 1995 నుంచి చంద్రబాబు పాలన లీకులు, అవినీతితోనే నిండిపోయిందన్నారు. ఈసారి డీఎస్సీ కన్వీనర్ను పక్కనపెట్టి, ప్రశ్నపత్రం రూపకల్పన, పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించారని, ఒకే అధికారి చేతిలో కీలక అధికారాలు కేంద్రీకరించి పారదర్శకతను దెబ్బతీశారని ఆరోపించారు. ప్రశ్నపత్రం ఎంతమంది చేతుల్లోకి వెళ్లింది, ఎంత డబ్బు చేతులు మారింది అనే విషయాలు థర్డ్ పార్టీ ఏజెన్సీ విచారణలోనే తేలుతాయన్నారు.
స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ జగన్ ధ్వజమెత్తారు. "స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు అర్హత పరీక్ష రాయాల్సిన అవసరం లేదని, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలని జీవోలు ఇచ్చి తమకు కావాల్సిన వారిని ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇచ్చిన కాలేజీ, యూనివర్సిటీ, జిల్లా స్థాయి పోటీల పార్టిసిపేషన్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చారు. మరోవైపు, జాతీయ క్రీడల్లో బంగారు పతకాలు సాధించి ఇంటర్వ్యూలకు పిలిపించిన నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. మొత్తం 270 మంది అర్హత పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందారు" అని జగన్ వివరించారు.
సీబీఐ విచారణే శరణ్యం
తమ హయాంలో నోటిఫికేషన్ నుంచి నియామక పత్రాలు ఇచ్చే వరకు కేవలం నాలుగు నెలల్లో 1.30 లక్షల ఉద్యోగాలను ఎలాంటి లోపాలు లేకుండా భర్తీ చేశామని జగన్ గుర్తుచేశారు. డీఎస్సీ వ్యవహారంలో చంద్రబాబు, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయన కుమారుడు లోకేశ్ ముద్దాయిలని, వారే తీర్పు చెబితే న్యాయం జరగదని, అందుకే సీబీఐ విచారణ డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. జూన్ 12న తలపెట్టిన 'వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన కార్యక్రమంలో ఈ డీఎస్సీ అక్రమాల అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.