దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత
- ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఇక లేరు
- చెన్నైలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- గ్రామీణ కథలతో భారతీయ సినిమాలో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన దిగ్గజం
- కుమారుడి మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన భారతీరాజా
- 'సీతాకోకచిలుక', 'ఆరాధన' వంటి తెలుగు చిత్రాలకూ దర్శకత్వం
ఆయనకు భార్య చంద్రలీల, కుమారుడు మనోజ్, కుమార్తె జనని ఉన్నారు. గతేడాది మార్చి 2025లో భారతీరాజా కుమారుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన సంగతి తెలిసిందే. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది. అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
1941 జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో వచ్చిన '16 వయతినిలే' చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతిని మార్చేసింది. శ్రీదేవి, రజినీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 'పదహారేళ్ల వయసు' పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా ఘన విజయం సాధించింది.
ఐదు దశాబ్దాల తన సుదీర్ఘ కెరీర్లో భారతీరాజా దాదాపు 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కిళక్కే పోగుమ్ రైల్, సిగప్పు రోజాక్కళ్, ముదల్ మరియాదై, వేదం పుదిదు వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన 'సీతాకోకచిలుక', 'ఆరాధన', 'జమదగ్ని' వంటి చిత్రాలు కూడా క్లాసిక్లుగా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు.
తెలుగులో సూపర్ హిట్ చిత్రం 'మంగమ్మ గారి మనవడు' చిత్రానికి కథ అందించింది భారతీరాజానే. 1994లో వచ్చిన 'పల్నాటి పౌరుషం' సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ఆయన దర్శకత్వం వహించిన 'సీతాకొకచిలుక' చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం వరించింది.
భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను ఆరు జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయనను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దుగా 'మిరాకిల్ డైరెక్టర్' అని పిలుచుకునే భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.