రేపు సైకిలెక్కనున్న సీఎం చంద్రబాబు.. రాష్ట్రవ్యాప్త కార్యక్రమానికి విశాఖ నుంచి శ్రీకారం
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా టీడీపీ సైకిల్ యాత్ర
- విశాఖలో సైకిల్ యాత్రలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని చాటడమే లక్ష్యం
- ఇంధన సంక్షోభం దృష్ట్యా సైకిల్ వాడకం పెంచాలని పిలుపు
- 'నా దేశం - నా బాధ్యత'గా ఇంధనం తగ్గించాలని సూచన
గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. "ప్రపంచం నేడు వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, తగ్గుతున్న పచ్చదనం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. పర్యావరణాన్ని కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యతే కాదు, ఇందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం. ఈ ఆలోచనతోనే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు టీడీపీ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టింది" అని ఆయన వివరించారు.
సైకిల్ వినియోగం వల్ల కాలుష్యం, ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పల్లా పేర్కొన్నారు. చిన్న ప్రయత్నాలే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయని, రేపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమ రోజువారీ కార్యక్రమాలకు సైకిళ్లను వినియోగించి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా మన దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన "నా దేశం - నా బాధ్యత" నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పల్లా సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంధన వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవడం ద్వారా ఇంధన సంక్షోభాన్ని, వాతావరణ కాలుష్యాన్ని అధిగమించవచ్చన్నారు. ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకునే ఈసారి మహానాడు కార్యక్రమాన్ని హైబ్రిడ్ విధానంలో నిర్వహించామని, సుమారు 24 లక్షల మంది కార్యకర్తలు డిజిటల్ వేదికగా హాజరై విజయవంతం చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు, ప్రజలు సైకిల్ యాత్రలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణకు 'నేను సైతం' అంటూ ముందుకు రావాలని కోరారు.