పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ... తీవ్రంగా స్పందించిన జనసేన పార్టీ

  • తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు జనసేన సభకు అనుమతి నిరాకరణ
  • పార్కింగ్ సమస్యను కూడా ఓ కారణంగా చూపి కార్యక్రమానికి బ్రేకులు
  • ప్రభుత్వ నిర్ణయం అర్థరహితమంటూ జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం
  • నిత్యం కార్యక్రమాలు జరిగే చోట తమకే ఎందుకు అడ్డంకులని ప్రశ్న
  • కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అనుమతి ఇవ్వలేదని పార్టీ ఆరోపణ
తెలంగాణలో పవన్ కల్యాణ్ తలపెట్టిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ'కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ చర్య పూర్తిగా అర్థరహితమని, రాజకీయ దురుద్దేశంతోనే తమ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని పార్టీ వర్గాలు ఆరోపించాయి.

వివరాల్లోకి వెళితే, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' పేరిట ఓ ఇండోర్ కార్యక్రమం నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. సుమారు 2000 మంది పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ హాల్‌లో ఈ సమావేశం తలపెట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పాత్ర, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం వంటి అంశాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

అయితే, పార్కింగ్ సమస్యను కారణంగా చూపుతూ ప్రభుత్వం ఈ సభకు అనుమతి నిరాకరించింది. ఈ నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా తప్పుబట్టింది. నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ సమావేశాలు జరిగే సంధ్య కన్వెన్షన్‌లో, కేవలం తమ కార్యక్రమానికే పార్కింగ్ సమస్యను కారణంగా చూపడం సహేతుకం కాదని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వివాదం ముగిసిపోయిన అధ్యాయమని, ఆయనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని జనసేన గుర్తుచేసింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు ఉండబోవని స్వయంగా పవన్ కల్యాణ్ స్పష్టం చేశారని వెల్లడించింది. అయినప్పటికీ, ఆ వ్యవహారాన్ని సాకుగా చూపి సభను అడ్డుకోవడం సరికాదని పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

Pawan Kalyan
Janasena Party
Telangana Nava Nirman Sankalpa Sabha
Telangana formation day
Sandhya Convention Hall
Gachibowli
Telangana politics
Professor Nageshwar
AP Government
Party meeting

More Telugu News