జైల్లో ప్రసవం.. బెయిల్‌ వచ్చినా వెళ్లలేని నిస్సహాయత.. మానవత్వంతో ఆదుకున్న అధికారులు

  • జైల్లో బిడ్డకు జన్మనిచ్చిన వలస మహిళ
  • బెయిల్ వచ్చినా ఇంటికి వెళ్లలేని దీనస్థితి
  • న్యాయ సేవా సంస్థ, జైలు అధికారుల చొరవ
  • పోలీసుల సహాయంతో మధ్యప్రదేశ్‌లోని కుటుంబంతో కలిసిన వైనం
జైల్లో బిడ్డకు జన్మనిచ్చి, బెయిల్ మంజూరైనా ఇంటికి వెళ్లేందుకు ఎవరూ లేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ వలస మహిళను అధికారులు ఆదుకున్నారు. గుజరాత్‌లోని నడియాడ్ జిల్లా జైలు అధికారులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) అధికారులు చొరవ తీసుకుని, ఆమెను పసిబిడ్డలతో సహా మధ్యప్రదేశ్‌లోని సొంత గ్రామానికి సురక్షితంగా పంపించారు.

మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఈ మహిళ, ఉపాధి కోసం తన కుటుంబంతో కలిసి గుజరాత్‌కు వలస వచ్చింది. ఆనంద్ జిల్లాలోని ఖంభాత్‌లో మైనర్ బాలిక అపహరణకు సంబంధించిన పోక్సో చట్టం కింద నమోదైన కేసులో ఆమెను సహ నిందితురాలిగా చేర్చారు. ఆమె భర్త, మరిదితో పాటు ఆమెను కూడా నడియాడ్ జిల్లా జైలుకు తరలించారు. జైలుకు వచ్చినప్పుడు ఆమె గర్భవతి, ఆమెతో పాటు రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

ఈ నెల‌ 21న ఆమెకు పురిటినొప్పులు రావడంతో మొదట నడియాడ్ సివిల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నవజాత శిశువు, రెండేళ్ల కుమారుడితో కలిసి జైలులోనే ఉంది. ఆ తర్వాత స్థానిక కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, భర్త జైల్లోనే ఉండటం, ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఆమెను విడిపించుకోవడానికి కుటుంబ సభ్యులెవరూ ముందుకు రాలేదు.

ఈ పరిస్థితిని గమనించిన డీఎల్‌ఎస్‌ఏ అధికారులు, ఆమెను సురక్షితంగా ఇంటికి పంపించాలని జైలు అధికారులను కోరారు. డీజీపీ కేఎల్‌ఎన్ రావు ఆదేశాల మేరకు, నడియాడ్ జైలు పోలీసులు ఒక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల భద్రత నడుమ ఆమెను, ఇద్దరు పిల్లలను మధ్యప్రదేశ్‌లోని ఆమె గ్రామానికి తరలించారు. అక్కడ స్థానిక పోలీసుల సమక్షంలో ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ కుమార్తెను సురక్షితంగా ఇంటికి చేర్చినందుకు ఆమె కుటుంబ సభ్యులు గుజరాత్ పోలీసులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Gujarat Police
Nadiad Jail
Woman Delivery
Bail Granted
Migrant Woman
POCSO Act
Ahmadabad Civil Hospital
KLN Rao

More Telugu News