కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు... రాహుల్ గాంధీతో షర్మిల భేటీ

YS Sharmila Meets Rahul Gandhi Regarding Rajya Sabha Elections in Karnataka
  • భేటీలో షర్మిల భర్త అనిల్ కుమార్, కేసీ వేణుగోపాల్
  • కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు కథనాలు
  • వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన సమయంలో రాజ్యసభ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్ణాటకలో త్వరలో రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆమె పార్టీ అగ్రనాయకుడితో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటును షర్మిల కోరుతున్నట్లు మీడియాలో ప్రచారం సాగుతోంది.

వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సమయంలో షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రాజ్యసభ సీటును హామీ ఇచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి, రాజ్యసభలో కాంగ్రెస్ తరఫున ఏపీ గొంతును వినిపించడానికి తనకు రాజ్యసభ సీటును ఇవ్వాలని ఆమె కోరుతున్నారని తెలుస్తోంది.

రాహుల్ గాంధీతో భేటీ అనంతరం షర్మిల కారులో వెళుతుండగా మీడియా పలకరించింది. ఈ సమావేశంలో ఎప్పటిలా సాధారణ సమీక్ష జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. రాహుల్ గాంధీతో భేటీలో షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు.
Go Back to Shorts
YS Sharmila
Rahul Gandhi
Karnataka Rajya Sabha Elections
Congress Party
KC Venugopal
Andhra Pradesh Politics

More Telugu News