తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?.. సీఎం రేవంత్‌కు ఏపీ బీజేపీ నేత సూటి ప్రశ్న

  • తెలంగాణలో ఉండాలంటే పాస్‌పోర్ట్, వీసా కావాలా అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ప్ర‌శ్న‌
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను బెదిరించిన ఎమ్మెల్యే సామేల్‌పై కేసు పెట్టాలని డిమాండ్
  • హైదరాబాద్‌లో ఏపీ నేతల పెత్తనం ఏంటని ప్రశ్నించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్
  • ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేస్తారనే ప్రచారంతో మొదలైన వివాదం
  • ఐదు కోట్ల ఆంధ్రులను అవమానించడం న్యాయమేనా? అని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన
ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు సంబంధించిన వివాదం తెలుగు రాష్ట్రాల మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా బదులిచ్చారు. "తెలంగాణలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్ట్, వీసా ఏమైనా కావాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు?" అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి 'వెంటనే జూబ్లీహిల్స్ వదిలి వెళ్లిపోవాలి' అంటూ బెదిరింపులకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌పై సుమోటోగా కేసు నమోదు చేయాలని తెలంగాణ డీజీపీని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకే ఇలాంటి బహిరంగ బెదిరింపులు వస్తే, ఇక తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానించడమేనని అన్నారు. తెలంగాణ ప్రజలు అందరినీ ప్రేమించే వారని, కానీ కొందరు రాజకీయాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్య‌క్తం చేశారు.

వివాదానికి నేపథ్యం ఇదే..
మూడు రోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారంటూ ప్రచారం జరిగింది. దీనిపై కొందరు జర్నలిస్టులతో కలిసి తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ స్పందించారు. చంద్రబాబు, పవన్‌లకు హైదరాబాద్‌లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ మేధావులపై అరాచకాలు సాగవని హెచ్చరించారు. బతకడానికి తెలంగాణకు వచ్చిన వారు పద్ధతిగా ఉండాలని, పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకునేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 60 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా నేతలకు వ్యతిరేకంగా పోరాటం వస్తుందని ఆయన హెచ్చరించడంతో ఈ వివాదం ముదిరింది.

Vishnu Kumar Reddy
Revanth Reddy
Telangana
Andhra Pradesh
Chandrababu Naidu
Pawan Kalyan
Mandula Samuel
Telangana Politics
AP BJP
Professor Nageshwar

More Telugu News