తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ మెనూ ఇదే..

  • మెనూలో బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా
  • జూన్ 12న బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం
  • ఫలహారాలలోకి చట్నీ, సాంబార్, మిక్స్ట్ వెజిటేబుల్ కుర్మా
తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ విధానానికి సంబంధించిన మెనూ విడుదలైంది. మెనూలో బోండా, దోశ, పూరీ, మిల్లెట్ ఇడ్లీ, ఉప్మా ఉన్నాయి. రోజుకో వంటకాన్ని విద్యార్థులకు ఇవ్వనున్నారు. జూన్ 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. విద్యార్థులకు సరైన పోషకాలు అందించేలా మెనూను రూపొందించారు.

ఈ ఫలహారాలలోకి చట్నీ, సాంబార్, మిక్స్డ్ వెజిటెబుల్ కుర్మా వంటివి అందించనున్నారు. ఇంటర్ విద్యార్థులకు బలవర్ధక ఆహారాన్ని అందించేందుకు ఈ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ఈ సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కోసం ప్రతి సంవత్సరం రూ.120 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ పథకం కింద రాష్ట్రంలోని 1.92 లక్షలమంది ఇంటర్ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంతో పాటు బ్రేక్ ఫాస్ట్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడంతో, దీనిని ఈ సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు.

Revanth Reddy
Telangana
Inter students
Breakfast scheme
Midday meal scheme
Telangana government

More Telugu News