Advertisement

రూ.1.72 కోట్ల అవినీతి కేసు.. కేరళ మాజీ సీఎం పినరయి ఇంట ఈడీ సోదాలు

Pinarayi Vijayan ED Raids at Former Kerala CM Residence in Corruption Case
  • తిరువనంతపురం నివాసంలో తనిఖీలు
  • మనీ లాండరింగ్ కేసులో విచారణ
  • కుమార్తె కంపెనీపై అక్రమ చెల్లింపుల ఆరోపణలు
  • కేరళ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
  • రాష్ట్రవ్యాప్తంగా 12 చోట్ల రైడ్స్
మనీ లాండరింగ్ కేసులో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం విరుచుకుపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరుగుతుండడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు ఉదయాన్నే ఈ మెరుపు సోదాలు చేపడుతున్నారు.

ఎక్కడెక్కడ?
ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఉన్న విజయన్‌కు చెందిన తిరువనంతపురంలోని అద్దె ఇల్లు, కన్నూరులోని సొంత నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ చర్యలు తీసుకుంటున్నారు. ఇవే కాకుండా సీఎంఆర్ఎల్ ఎండీ శశిధరన్ ఇల్లు, మాజీ మంత్రి మహమ్మద్ రియాజ్‌ నివాసాల్లోనూ విచారణ సాగుతోంది.

అక్రమ చెల్లింపుల వివాదం
కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) అనే ప్రైవేట్ సంస్థ నుంచి విజయన్ కుమార్తె వీణా విజయన్ అక్రమంగా డబ్బులు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమెకు చెందిన ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ ఐటీ సంస్థ ఎలాంటి సేవలు అందించకపోయినా రూ.1.72 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఈ నిధుల బదిలీపైనే ఇప్పుడు ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది.

కోర్టు గ్రీన్ సిగ్నల్‌తో యాక్షన్
ఈ కేసు విచారణను నిలిపివేయాలని కోరుతూ సీఎంఆర్ఎల్ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు సింగిల్ బెంచ్ ఆ పిటిషన్లను తోసిపుచ్చింది. సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సమయం కావాలన్న కంపెనీ విజ్ఞప్తినీ న్యాయస్థానం తిరస్కరించడంతో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
Advertisement
Pinarayi Vijayan
Kerala CM
ED raids
Enforcement Directorate
Money laundering case
Veena Vijayan
CMRL
Kerala High Court
Corruption case

More Telugu News