పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో

Indias issue with Pakistan different says Marco Rubio
  • పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరాలు లేవన్న అమెరికా
  • ఉగ్రవాదంపై మాత్రం భారత్ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తుందని వెల్లడి
  • నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో
  • క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న అమెరికా మంత్రి
  • భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ధీమా
అంతర్జాతీయ అంశాల్లో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించడంపై భారత్‌కు ఎలాంటి అభ్యంతరాలు లేవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌పై భారత్‌కు తీవ్ర ఆందోళనలు ఉన్నప్పటికీ, మధ్యవర్తిత్వ పాత్రపై మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన రూబియో, విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. "పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థల వల్ల తమకు ముప్పు ఉందని భారత్ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇది వాస్తవమే. కానీ, ఇరాన్ విషయంలో పాక్ మధ్యవర్తిగా వ్యవహరించినప్పుడు, ఆ పాత్రపై భారత్ ఎప్పుడూ ప్రస్తావించలేదు. దానిపై వారు ఫిర్యాదు చేస్తారని నేను అనుకోవడం లేదు. పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు" అని రూబియో వివరించారు.

విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక రూబియో భారత్‌కు రావడం ఇదే తొలిసారి. మంగళవారం జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

ఈ సందర్భంగా రూబియో మాట్లాడుతూ.. భారత్ తమకు అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వామి అని, వాణిజ్యపరంగా కూడా కీలక దేశమని కొనియాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని, తమ పరిపాలన ముగిసే నాటికి అవి మునుపెన్నడూ లేనంతగా బలపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Marco Rubio
India Pakistan
India US relations
terrorism
Indian Foreign Policy
Quad meeting
Narendra Modi
S Jaishankar
US Foreign Policy
Pakistan mediation

More Telugu News