తమిళనాడులో పదేళ్ల బాలిక హత్య.. సీఎం విజయ్ రియాక్షన్‌ ఇదే..!

  • కోయంబత్తూర్‌లో ఘటన
  • కిరాణా సామాన్లకు వెళ్లిన చిన్నారి కిడ్నాప్, హత్య
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
  • కొత్త ప్రభుత్వంపై డీఎంకే విమర్శలు
  • నేరుగా పర్యవేక్షిస్తున్న రాష్ట్ర డీజీపీ
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఘోరం జరిగింది. సూలూరు ఏరియాలో కిరాణా సామాన్లు తేవడానికి వెళ్లిన పదేళ్ల బాలిక కిడ్నాప్‌కు గురైంది. ఆపై ఆ చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. శుక్రవారం చెరువు సమీపంలో మృతదేహం దొరికింది. ఈ ఘటనపై తమిళనాడు కొత్త సీఎం విజయ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి అమానవీయ చర్యలను అస్సలు సహించబోమని స్పష్టం చేశారు.

కఠిన శిక్షపడేలా చేస్తాం: విజయ్‌
‘‘ఈ ఘోర ఘటన దిగ్భ్రాంతిని, వేదనను కలిగించింది. ఇలాంటి అమానవీయ నేరాలను సహించబోం. కుటుంబ సభ్యులకు నా సానుభూతి. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. సమగ్రంగా విచారణ జరిపి తక్షణమే చార్జ్‌షీట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించాం. మహిళలు, పిల్లలపై ఇలాంటి ఘోరాలకు ఒడిగట్టే వారికి చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం కచ్చితంగా చర్యలు తీసుకుంటుంది’’ అని విజయ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు.

రాజకీయ దుమారం
ఈ హత్య రాష్ట్రంలో పెద్ద రాజకీయ దుమారం రేపింది. కొత్త ప్రభుత్వంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. సీఎం విజయ్ పదవి చేపట్టిన 12 రోజుల్లోనే నేరాలు పెరిగాయని ఉదయనిధి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని మండిపడ్డారు. మరోవైపు గత డీఎంకే ప్రభుత్వమే వ్యవస్థను నాశనం చేసిందని బీజేపీ విమర్శించింది.

ఇద్దరు నిందితుల అరెస్ట్
ఈ కేసులో కార్తీక్, మోహన్ రాజ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణను వేగవంతం చేయడానికి తమిళనాడు డీజీపీ స్వయంగా కోయంబత్తూర్ వెళ్లారు. సీఎం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మృతదేహాన్ని తీసుకోబోమని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆసుపత్రికి వెళ్లి బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Joseph Vijay
Tamil Nadu
Coimbatore
minor girl murder
Udhayanidhi Stalin
DMK
law and order
crime news
political controversy
Karthik and Mohan Raj

More Telugu News