కిడ్నీ మార్పిడిలో నిమ్స్ రికార్డు.. వైద్యులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

  • కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిమ్స్ ఘనత
  • 2000 ఆపరేషన్లు పూర్తి చేసి దేశంలో మూడో స్థానంలో నిలిచిన ఆసుపత్రి
  • వైద్య బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
  • 95 శాతం ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం
  • దక్షిణ భారత దేశంలో కిడ్నీ మార్పిడులలో నిమ్స్ మొదటి స్థానం
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) యూరాలజీ విభాగం వైద్య చరిత్రలో అరుదైన మైలురాయిని అందుకుంది. ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఈ చారిత్రక ఘనతను సాధించిన నిమ్స్ వైద్య బృందాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఘనతతో నిమ్స్ ఆసుపత్రి.. కిడ్నీ మార్పిడులలో దక్షిణ భారతదేశంలో మొదటి స్థానంలో, దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది. దేశంలో గుజరాత్‌లోని ఐకేడీఆర్‌సీ ప్రథమ స్థానంలో, లూధియానా క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. నిమ్స్‌లో జరిగిన ఈ 2,000 ఆపరేషన్లలో 1,900 మంది (95 శాతం) రాజీవ్ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించుకోవడం గమనార్హం.

గడిచిన మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలోనే నిమ్స్ వైద్యులు 500 కిడ్నీ మార్పిడులు పూర్తి చేశారు. కిడ్నీ బాధితులకు విశేష సేవలు అందిస్తూ, వారి పాలిట వరంగా నిలుస్తున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి ప్రశంసలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ పేదలకు అత్యాధునిక వైద్యాన్ని అందించడంలో నిమ్స్ ఆదర్శంగా నిలుస్తోందని ఆయన కొనియాడారు.

Revanth Reddy
NIMS Hyderabad
Kidney Transplant
Rajiv Aarogyasri
Telangana Health
Kidney Transplantation
Medical Achievement
Healthcare India
CM Relief Fund
Urology

More Telugu News