48.1 డిగ్రీలు... పిడుగురాళ్లలో రాళ్లు పగిలే ఎండ!

  • నిప్పుల కొలిమిలా ఏపీ
  • పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత
  • పలు జిల్లాల్లో 47 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
  • రాష్ట్రంలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదు
  • వచ్చే సోమవారం వరకు ఎండల తీవ్రత కొనసాగుతుందని హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి తన ప్రతాపాన్ని తీవ్రస్థాయిలో చూపిస్తోంది. రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తుండగా, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పిడుగురాళ్లలో నిన్న 47.6 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత, ఇవాళ మరింత పెరిగి 48.1 డిగ్రీలకు చేరింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం గమనార్హం.

ఇక ఇతర ప్రాంతాల్లోనూ భానుడు భగభగమంటున్నాడు. బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా టి.గుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కావలిలో 46.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నాడు 18 జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా, 20 జిల్లాల్లోని సుమారు 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు కీలక సూచనలు చేసింది. వచ్చే సోమవారం వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Piduguralla
Andhra Pradesh heatwave
heat wave
summer heat
high temperatures
weather forecast
AP weather
state disaster management
heatwave alert
India heatwave

More Telugu News